కాంగ్రెస్​ది 420 మేనిఫెస్టో ..ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చిన్రు: హరీశ్రావు

కాంగ్రెస్​ది 420 మేనిఫెస్టో ..ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చిన్రు: హరీశ్రావు

బీఆర్ఎస్​ పథకాలే కాపీ కొట్టారని ఫైర్ 
2009 మేనిఫెస్టో హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్

గజ్వేల్/ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ఆచరణ సాధ్యం కాని హామీలతో 42 పేజీల మేనిఫెస్టో విడుదల చేసిందని, కానీ అది 420 మేనిపెస్టో అని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​2009 మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో ఎన్ని నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘గతంలో అమలు చేయని, ఆచరణ సాధ్యం కాని పథకాలను పెట్టి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తానంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్​పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయని పథకాలను ఇక్కడ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం చెవిలో పువ్వులు పెట్టడం కాదా? ఆ పార్టీ ఎలాగూ అధికారంలోకి వచ్చేది లేదు.. అమలు చేసే అవసరం అసలే లేదు. కాబట్టే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నరు’’ అని అన్నారు.

కాగా, బీఆర్ఎస్​ పథకాలనే కాపీ కొట్టి కాంగ్రెస్ ​మేనిఫెస్టో తయారు చేశారని హరీశ్ విమర్శించారు. ‘‘రైతుబంధును నఖలు కొట్టిన్రు. ధరణిని కాపీ కొట్టి భూమాత అంటున్నరు. కల్యాణలక్ష్మిని ఇందిరమ్మ అంటరట’’ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్​ అంటే ఒక నమ్మకమని, ఆయన మాట తప్పని వ్యక్తి అని కొనియాడారు. ‘‘గజ్వేల్​లో ఆపతికి అందుబాటులో ఉన్నం. ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నోళ్లు అన్ని జూటా మాటలు మాట్లాడుతున్నరు’’ అని ఈటలపై హరీశ్​ మండిపడ్డారు.

రాహుల్ ​గాంధీ.. రాంగ్ ​గాంధీ అయిండు

కాంగ్రెస్ నేత రాహుల్ ​గాంధీ.. రాంగ్​ గాంధీ అయ్యారని హరీశ్ ​రావు ఎద్దేవా చేశారు. కర్నాటక ఫెయిల్ మోడల్ గురించి చెప్పి ఆయన రాష్ట్రంలో ఓట్లు అడగాలని సవాల్ ​చేశారు. కర్నాటక ప్రజల్లాగా కాంగ్రెస్‌‌ను నమ్మి మోసపోవడానికి సిద్ధంగా తెలంగాణ ప్రజలు లేరన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో హరీశ్​రావు సమక్షంలో కాంగ్రెస్​ నాయకురాలు కత్తి కార్తీక బీఆర్ఎస్‌‌లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్​ నేత చిదంబరం మరోసారి తెలంగాణ ప్రజల మనసును గాయపరిచేలా మాట్లాడారు. అమరుల త్యాగాలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి. కర్నాటకలో ఐదు గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన రాహుల్​ గాంధీ.. తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేయడానికి వస్తున్నారని హరీశ్ విమర్శించారు. వంద రోజుల్లోనే ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా​ ఇవ్వలేదని మండిపడ్డారు.