
- నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నలే తరువాయి
- రోజుకు 2 కోట్ల క్రూడాయిల్ బ్యారెల్స్ సప్లైపై ఎఫెక్ట్
- ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు 20% చమురు
- ఇండియాకు నిలిచిపోనున్న 20 లక్షల బ్యారెల్స్
టెహ్రాన్: అమెరికా దాడులను తీవ్రంగా పరిగణించిన ఇరాన్.. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఆయిల్ షిప్పింగ్లో ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు నిర్ణయించింది. ఇరాన్ పార్లమెంట్ కూడా దీనికి ఆమోదించింది. ఫైనల్గా ఇరాన్ సుప్రీం.. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ఎన్ఎస్సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే హర్మూజ్ జలసంధి క్లోజ్ అవుతుంది. ఇరాన్ పొలిటికల్ లీడర్లు కూడా హర్మూజ్ మూసివేతకు డిమాండ్ చేస్తున్నారు.
వరల్డ్వైడ్గా ఎంతో కీలకమైన చెక్ పాయింట్లలో హర్మూజ్ ఒకటి. ప్రపంచం మొత్తానికి సప్లై అయ్యే చమురు, గ్యాస్లో ఐదో వంతు ఇక్కడి నుంచే పాస్ అవుతుంది. ఈ జలసంధి.. పార్శియన్ గల్ఫ్, అరేబియా, హిందూ మహా సముద్రాలను కలుపుతుంది.
33 కిలో మీటర్లే..
హర్మూజ్ జలసంధి సుమారు 167 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. దీని అత్యంత ఇరుకైన భాగంలో 33 కిలో మీటర్ల వెడల్పు ఉంటుంది. షిప్పింగ్ లేన్లు ఒక్కో దిశలో 3 కిలో మీటర్ల వెడల్పులో మాత్రమే ఉంటాయి. రోజుకు 2 కోట్లకు పైగా క్రూడాయిల్ బ్యారెళ్లు ఈ జల సంధి నుంచే క్రాస్ అవుతుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగంలో 20 శాతం క్రూడాయిల్, 25 శాతం లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) ఈ జలసంధి మీదుగానే సప్లై అవుతుంటుంది. సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ వంటి ఒపెక్ సభ్య దేశాలు తమ క్రూడాయిల్ ఎగుమతులకు ఈ రూట్పైనే ఆధారపడతాయి. ఇది ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో కీలకం.
ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్?
హర్మూజ్ మూసివేస్తే 2కోట్ల క్రూడాయిల్ బ్యారెల్స్ సరఫరా ఆగిపోతుంది. దీంతో చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల నుంచి 130 డాలర్లకు పైగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే వారం రోజులుగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయం, ట్రాన్స్పోర్టేషన్, ప్రొడక్టివిటీపై తీవ్ర ప్రభావం పడి ఖర్చులు పెరుగుతాయి. చివరికి ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
ఇండియాపై ప్రభావం ఎంత?
ఇండియా తన చమురు దిగుమతుల్లో 67 శాతం, లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్లో 50శాతం హర్మూజ్ జలసంధి ద్వారా పొందుతుంది. ఈ జలసంధి మూసేస్తే రోజుకు 20 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ సప్లై ఆగిపోతుంది. ఫలితంగా ఇంధన కొరత ఏర్పడి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయంగా అమెరికా, బ్రెజిల్, రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసి కొరతను అధిగమించొచ్చు.
మనకు ఆల్టర్నేట్ రూట్
హర్మూజ్ జలసంధి మూసివేస్తే ఆల్టర్నేట్ ఉంది. మన నౌకలు అన్నీ ఆఫ్రికా (కేప్ ఆఫ్ గుడ్ హోప్)కు మళ్లించబడతాయి. ఇలా చేయడంతో టైమ్, ఖర్చు పెరుగుతుంది. ఒక షిప్ ఇండియాకు రావాలంటే 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. షిప్పింగ్ ఖర్చులు 20 నుంచి 30 శాతం పెరుగుతాయి. లేదంటే.. సౌదీ అరేబియా ద్వారా పైప్లైన్ రవాణా (రెడ్ సీ వెంట)ను పరిశీలించొచ్చు. కానీ.. ఇది మన క్రూడాయిల్ క్వాంటిటీ, టైమ్పై ఆధారపడి ఉంటుంది.
ప్రపంచ దేశాల ఆందోళన
ఐక్యరాజ్య సమితి: అమెరికా దాడులు ప్రమాదకరమని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. దౌత్య మార్గమే శాంతికి ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు.
లెబనాన్: అమెరికా దాడులు ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తాయని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశం కూడా యుద్ధ భారాన్ని భరించలేదన్నారు.
బ్రిటన్: ఇరాన్ దౌత్య చర్చలకు తిరిగి రావాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. ఇరాన్ నిర్వహిస్తున్న అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచ భద్రతకు ముప్పని ఆయన హెచ్చరించారు.
న్యూజిలాండ్: అన్ని పక్షాలూ చర్చలకు తిరిగి రావాలని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ పిలుపునిచ్చారు. దౌత్యం శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.
హమాస్, హౌతీలు: హమాస్, హౌతీ తిరుగుబాటుదారులు అమెరికా దాడులను ఖండించారు. ఇరాన్కు మద్దతుగా ముస్లిం దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
చైనా: అమెరికా దాడులు మధ్యప్రాచ్యంలో అస్థిరతను పెంచుతాయని చైనా మీడియా హెచ్చరించింది. దౌత్య చర్చలే స్థిరత్వానికి ఉత్తమ మార్గమని పేర్కొంది.
దక్షిణ కొరియా: అమెరికా దాడుల నేపథ్యంలో భద్రతా, ఆర్థిక పరిణామాలపై దక్షిణ కొరియా అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రజల భద్రత, స్థిరమైన జీవనం ప్రధానమని అధికారులు పేర్కొన్నారు.
జపాన్: పరిస్థితిని త్వరగా శాంతింపజేయాలని జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను నిరోధించాలని, జపనీయుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆస్ట్రేలియా: ఇరాన్ యొక్క అణ్వాయుధ, క్షిపణి కార్యక్రమాలు అంతర్జాతీయ శాంతికి ముప్పని ఆస్ట్రేలియా అధికారి అన్నారు. దౌత్యం, శాంతి చర్చలకు పిలుపునిచ్చారు.