
హైదరాబాద్, వెలుగు: వాలీబాల్ ఆటకు దేశంలో కొత్త ఊపు తీసుకురావడానికి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (హెచ్బీహెచ్) టీమ్ ముందడుగు వేసింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో పోటీపడుతున్న ఈ ప్రొఫెషనల్ టీమ్ స్టూడెంట్స్ నిర్వహిస్తున్న వర్సిటీ స్పోర్ట్స్తో కలిసి ‘పీవీఎల్ హెచ్బీహెచ్ వర్సిటీ వాలీబాల్ లీగ్’ను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఐదు వారాల పాటు జరిగే ఈ లీగ్లో హైదరాబాద్లోని 50 స్కూల్స్ నుంచి దాదాపు 32 బాయ్స్, 19 గర్ల్స్ టీమ్స్ పాల్గొంటాయి.
స్కూల్ లెవెల్లోని ప్లేయర్లకు వాలీబాల్ ఆడేందుకు ఒక వేదిక కల్పించడంతో పాటు ఈ క్రీడ వైపు వారిని ఆకర్షించడానికి ఈ లీగ్ను నిర్వహిస్తున్నట్టు బ్లాక్ హాక్స్ టీమ్ ఓనర్ కంకణాల అభిషేక్ రెడ్డి వెల్లడించారు. దేశంలో లీగ్ ఫార్మాట్లో నిర్వహిస్తున్న తొలి వాలీబాల్ లీగ్ ఇదేనని తెలిపారు. తాను స్కూల్ లెవెల్లో వాలీబాల్ ఆడేందుకు ఇలాంటి లీగ్స్ లేకపోవడంతో ప్రాక్టీస్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని బ్లాక్ హాక్స్ టీమ్ స్టార్ ప్లేయర్ గురు ప్రశాంత్ చెప్పాడు. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ లీగ్ను యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నాడు.