
- 460 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 8 శాతం డౌన్, 4 శాతం వరకు పడిన ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్
- నికరంగా రూ.10 వేల కోట్ల షేర్లు అమ్మేసిన విదేశీ ఇన్వెస్టర్లు
వరుస సెషన్లలో ర్యాలీ చేస్తూ కొత్త రికార్డ్లు క్రియేట్ చేసిన బెంచ్మార్క్ ఇండెక్స్లకు బుధవారం సెషన్లో పెద్ద షాక్ తగిలింది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు శాతం చొప్పున నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే నాలుగు శాతం క్రాష్ అయ్యింది. ఇండెక్స్ హెవీ వెయిట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రిజల్ట్స్ ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (వడ్డీ ఆదాయం మైనస్ వడ్డీ ఖర్చులు) పై ఒత్తిడి పెరగడంతో ఫైనాన్షియల్ షేర్లన్నీ బుధవారం కుదేలయ్యాయి. నిఫ్టీ 50 లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 13.52 శాతం వాటా ఉంది.
బ్యాంక్ షేర్లు 8 శాతం క్రాష్ అవ్వడంతో మొత్తం మార్కెట్ మూడ్ మారిపోయింది. నిఫ్టీ బుధవారం 460 పాయింట్లు (2.09 శాతం) పడి 21,572 దగ్గర , సెన్సెక్స్ 1,628 పాయింట్లు పతనమై 71,501 దగ్గర సెటిలయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ 2,061 పాయింట్లు నష్టపోయి 46,064 లెవెల్కు పడిపోయింది. ఇన్వెస్టర్లు రూ.4.53 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.370.42 లక్షల కోట్లకు తగ్గింది.
మార్కెట్ ఎందుకు పడిందంటే..
1. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లను బుధవారం సెషన్లో భారీగా అమ్మేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పడడంతో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ వంటి షేర్లు కూడా 4 శాతం వరకు పడ్డాయి. నిఫ్టీ 460 పాయింట్లు పతనమవ్వగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పడడం వలనే 235 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నెట్ ప్రాఫిట్ డిసెంబర్ క్వార్టర్లో 34 శాతం పెరిగినా, లోన్ గ్రోత్, లోవర్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్సీఆర్) ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. కరోనా తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఇదే అతిపెద్ద సింగిల్ డే లాస్.
2. వడ్డీ రేట్లను తగ్గించడం అనుకున్న దాని కంటే లేటవుతుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ తర్వాత వడ్డీ రేట్లను తగ్గింపు మార్చి తర్వాతనే ఉంటుందనే అంచనాలు 65 శాతానికి పెరిగాయి.
3. ఫెడ్ గవర్నర్ కామెంట్స్తో యూఎస్ బాండ్ ఈల్డ్లు, డాలర్ ఇండెక్స్ బుధవారం పెరిగాయి. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4 శాతాన్ని దాటింది. డాలర్ ఇండెక్స్ ఒక నెల గరిష్టానికి చేరుకుంది.
4. యూఎస్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగియడంతో ఈ ఎఫెక్ట్ బుధవారం సెషన్లో గ్లోబల్ మార్కెట్లపై పడింది. జపాన్, చైనీస్, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం వరకు పడ్డాయి.
5. ఐటీ సెక్టార్ మినహా మిగిలిన సెక్టార్ల ఇండెక్స్లన్ని బుధవారం భారీగా పడ్డాయి. డాలర్ ఇండెక్స్ పెరగడంతో మెటల్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం క్రాష్ అయ్యింది. ఆటోమొబైల్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, పీఎస్యూ బ్యాంక్స్, ఇన్ఫ్రా ఇండెక్స్లు ఒక శాతం చొప్పున పడ్డాయి. బ్రాడ్ మార్కెట్లో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఇండెక్స్లు ఒక శాతం చొప్పున నష్టపోయాయి.
6. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) బుధవారం సెషన్లో నికరంగా రూ.10,578 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇదే టైమ్లో డొమెస్టిక్ ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ.4,006 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.