పైలట్‌తోపాటు స్థానికులే మమ్మల్ని కాపాడారు

పైలట్‌తోపాటు స్థానికులే మమ్మల్ని కాపాడారు

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌లో శుక్రవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసెంజర్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలుగా విరిగింది. యాక్సిడెంట్‌లో 20 మంది ప్రయాణికులు చనిపోగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. కరోనా కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న స్వదేశీయులను ఈ విమానంలో తీసుకొస్తున్నారు. అయితే కేరళలో భారీ వర్షాలతో విమానం ల్యాండింగ్‌ టైమ్‌కు కొద్దిసేపు ముందు రన్‌వేను ఢీకొట్టింది. ఈ విమానంలో 190 మంది ప్యాసెంజర్స్, సిబ్బంది, 10 మంది చిన్నారులు ఉన్నారని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది.

పైలట్‌తోపాటు స్థానికులు తమను కాపాడారని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ రెసిడెంట్స్ అక్కడకు చేరుకొని తమకు సాయం చేశారన్నారు. ‘భారీ వర్షం పడుతోంది. ల్యాండింగ్‌కు ముందు వాతావరణం బాగోలేదని పైలట్‌ను హెచ్చరించాం. సేఫ్ ల్యాండింగ్ కోసం అతడు రెండుసార్లు యత్నించాడు. కానీ అదుపు తప్పిన ఎయిర్‌‌క్రాఫ్ట్‌ రన్‌వేను గట్టిగా ఢీకొట్టింది. దీంతో అది రెండు ముక్కలుగా విరిగింది. చాలా మందికి ఇదో అద్భుతమైన ఎస్కేప్’ అని ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడిన వి.ఇబ్రహీం అనే ప్రయాణికుడు చెప్పాడు. మొత్తం 190 మంది ప్రయాణికుల్లో 123 మందికి గాయాలవ్వగా, 20 మంది సీరియస్ కండీషన్‌లో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 38 మంది ప్రయాణికులు కోజికోడ్‌లోని ఎంఐఎంఎస్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, 28 మందిని బేబీ మెమోరియల్ ఆస్పత్రిలో, మరో 14 మందిని మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్చామని అధికారులు పేర్కొన్నారు.