
- స్కూళ్లలో హెల్త్ చెకప్స్
- ప్రతీ పాఠశాలకూ ఫస్ట్ ఎయిడ్ కిట్స్
- కొనసాగుతున్న సికిల్సెల్ నిర్ధారణ పరీక్షలు
- ఇప్పటికే 12,600 మందికి టెస్టులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారి ఆరోగ్య రక్షణకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. 114 స్కూళ్లలో చదివే 15,834 మందికి మెడికల్ చెకప్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సికిల్సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే 12,600 మందికి వైద్య, ఆరోగ్యశాఖ టెస్టులు పూర్తి చేసింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే వైద్యంతో నివారించవచ్చనే ఉద్దేశ్యంతో చిన్నారుల పట్ల కేర్ తీసుకుంటున్నారు. సెలవుల అనంతరం స్కూళ్లకు వచ్చే చిన్నారుల ఆరోగ్య స్థితిగతులపైనా నజర్ పెట్టారు. ప్రతీ స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ స్కూల్లో ఉండేలా పీవో బి.రాహుల్ చర్యలు తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రతీ పీహెచ్సీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
స్కూళ్లలో మెడికల్ కిట్స్
ప్రతీ స్కూల్లో మెడికల్ కిట్ తప్పనిసరి చేస్తూ పీవో బి.రాహుల్ ఆదేశాలు జారీ చేశారు. గిరిజన స్టూడెంట్లు అస్వస్థతకు గురైతే తక్షణమే ప్రథమ చికిత్సను అందిస్తారు. ఏడు రకాల వస్తువులతో కూడిన మెడికల్ కిట్ను స్కూల్కు అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ మెడికల్ కిట్ల కోసం షార్ట్ టెండర్లను పిలిచింది. వెయింగ్ మిషన్, హైట్ స్కేల్, బీపీ ఆపరేటర్, థర్మామీటర్, బ్యాండ్ఎయిడ్, టార్చ్, ఐవీ స్టాండ్ ఈ ఏడు వస్తువులతో మెడికల్ కిట్ ఉంటుంది. వీటితో పాటు సమీప పీహెచ్సీలు ఆయా స్కూళ్లకు కొన్ని మెడిసిన్స్ ఇస్తాయి. మెడికల్ టీం స్కూల్కు చేరుకునే లోపు స్టూడెంట్కు టీచర్లు ప్రథమ చికిత్స అందిస్తారు. కోలుకున్నాక పరిస్థితిని బట్టి స్టూడెంట్ను పీహెచ్సీకి తరలిస్తారు.
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో టీచింగ్తో పాటు చిన్నారుల హెల్త్ కండీషన్లపైనే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన అవసరంపై ప్రతీ రివ్యూ మీటింగ్లో ఐటీడీఏ అధికారులు టీచర్లకు సూచనలు జారీ చేస్తున్నారు. పిల్లలకు పెట్టే భోజనం, టిఫిన్స్, తాగునీటి విషయాల్లో, వంటశాల, డైనింగ్ హాల్, హాస్టల్, స్కూల్ పరిసరాల పరిశుభ్రతపై టీచర్లతో పాటు, వంట సిబ్బందికి కూడా డీడీ మణెమ్మ ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ ఏర్పాటు చేశారు. కంటికి రెప్పలా స్టూడెంట్లను చూసుకోవాలని హాస్టల్స్, ఆశ్రమ స్కూళ్ల స్టాఫ్కు సూచనలు ఇస్తున్నారు. నిత్యం స్టూడెంట్ల వివరాలు, వారి ఆరోగ్య స్థితిగతులు, చదువు అన్ని విషయాలు ఐటీడీఏ కేంద్రానికి ఏటీడీవోల ద్వారా పీవో, డీడీలకు నివేదికల రూపంలో అందజేసేలా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
అప్రమత్తత అవసరం
స్కూల్, హాస్టల్ ఎక్కడైనా పిల్లల విషయంలో స్టాఫ్ అప్రమత్తతతో ఉండటం ఎంతో అవసరం. వానాకాలం వ్యాధులతో పాటు విషపురుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతతో వ్యవహరించి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ అక్కడే అందించేలా కిట్స్ ఇస్తున్నాం. ఏ విషయమైనా ముందుగా సమాచారం ఇవ్వాలి. మెడికల్ స్టాఫ్ గ్రామాలు విజిట్ చేసినప్పుడు తప్పనిసరిగా స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్ధులను టెస్ట్ చేసేలా సూచనలు చేశాం.
బి.రాహుల్, పీవో