వర్షబీభత్సం.. మత్తళ్లు దుంకిన చెరువులు

వర్షబీభత్సం.. మత్తళ్లు దుంకిన చెరువులు

భీమదేవరపల్లి/ శాయంపేట (ఆత్మకూర్)/ ​ఎల్కతుర్తి, వెలుగు:  ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ముల్కనూరు చెరువుకు తూము ద్వారా వచ్చే కాలువ బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. విశ్వనాథ కాలనీ సమీపంలో దేవాదుల నార్త్​ కెనాల్​కు గండి పడింది. ఆత్మకూర్​ మండలంలోని కటాక్షాపూర్​ చెరువు మత్తడి దూకడంతో శుక్రవారం భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. మత్తడి ప్రాంతంలో పెద్దపెద్ద గుంతలు ఉండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎల్కతుర్తి మండలంలోని బస్టాండ్​ జంక్షన్​ జలమయమయ్యింది. 

డీసీఎం, టాటా ఏస్​ వాహనాలు మురుగు కాల్వ పక్కన బురదలో కూరుకుపోయాయి. బోడికోనికుంట, సీతాపతికుంట, నల్లకుంటతోపాటు పలు కుంటలు, చెరువులు మత్తడి దూకాయి. మండల పరిధిలోఇన గోపాల్​పూర్​కు చెందిన గాజుల రాకేశ్​ హుజూరాబాద్​ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, తాళ్లవాగు ప్రవాహానికి బైక్​తో సహా బ్రిడ్జి పిల్లర్ల వద్ద చిక్కుకున్నాడు. కాపాడమని అరవడంతో కిషన్​రావు అనే వ్యక్తి 100కు సమాచారమిచ్చాడు. దీంతో సీఐ రమేశ్, ఎస్సై ప్రవీణ్​కుమార్​ ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సాయంతో రాకేశ్​ను రక్షించారు. వారితోపాటు కానిస్టేబుల్​ బక్కయ్య, వికిల్, రాజు ఉన్నారు.​​