
మహారాష్ట్ర, గుజరాత్లో కుండపోత
ముంబై : మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్, వెస్ట్బెంగాల్, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురుగ్రామ్లో ఉదయం 6 గంటల నుంచి కురిసిన కుండపోత వర్షానికి ఎక్స్ప్రెస్వే సహా 25 ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీలో గురువారం ఉదయం కురిసిన వానకు పలు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు జమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీకి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
మహారాష్ట్రలో ముగ్గురు మృతి
మహారాష్ట్రలోని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు చనిపోయారు. థానే, పాల్ఘర్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కూలిపోగా, కార్లు వరదకు కొట్టుకుపోయాయి. థానేలోని దివాలో 16 ఏండ్ల బాలుడు, పాల్ఘర్లో రాంజీ గింబల్ (45) వరదలో కొట్టుకుపోయారు. థానే సిటీలో 20 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. భీవండి, కళ్యాణ్, ఉల్లాస్నగర్ టౌన్షిప్స్లో నీళ్లు చేరాయి. ముంబైలో చెట్టు విరిగిపడటంతో ఒకరు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. ముంబైకి ఎల్లో అలెర్ట్, నాసిక్, పాల్ఘర్, రాయ్గడ్, థానే, రత్నగిరి, సింధుదుర్గ్కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బైకుల్లా ఏరియాలో గుడిసెపై మర్రిచెట్టు పడటంతో రెహ్మాన్ ఖాన్ (22)
చనిపోయాడు.
గుజరాత్లో నలుగురు చిన్నారులు మృతి
గుజరాత్ పంచమహల్ జిల్లాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ ఫ్యాక్టరీ గోడ కూలి ఐదేండ్లలోపు ఉన్న నలుగురు చిన్నారులు చనిపోయారు. బాధితులు మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరి తల్లిదండ్రులు హలోల్ మండలం చంద్రపురా విలేజ్లో కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర్లో కూలి పని చేసుకుంటూ జీవించేవారు. మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీ గోడకు ఆనుకుని టెంట్ వేసుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. భారీ వర్షానికి గోడ కూలిపోయింది. దామోర్ (5), అభిషేక్ భురియా (4), గున్గున్ భురియా (2), ముస్కాన్ భురియా (5) స్పాట్లోనే చనిపోయారు.
గాయపడిన ఐదుగురిని హలోల్ హాస్పిటల్కు తరలించారు. వల్సద్, సూరత్, నవ్సరి, తాపి జిల్లాల్లో మూడు రోజులుగా కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా చిన్కా వద్ద కొండ చరియలు విరిగిపడటంతో బద్రినాథ్ నేషనల్ హైవేను అధికారులు మూసివేశారు. రాజస్థాన్లోని నివాయి, దెచు ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది. ఈ రెండు ప్రాంతాల్లో సుమారు 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.