డిజిటల్ ట్రాన్జాక్షన్ జమానాలో ఏటీఎంలు లేని ప్లేస్ని ఊహించుకోగలమా?. పోనీ నాలుగైదు రోజులు మొబైల్ ఫోన్ వాడకుండా ఉండగలమా?. కానీ, ఆ ఆఫ్రికా దేశపు ప్రజలకు ఏటీఎం ఎట్లా ఉంటుందో తెలియదు. పొరపాటున మొబైల్ ఫోన్ కొన్నా.. దాంట్లో సిమ్ కార్డు కోసం పిట్టకు పెట్టినట్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి. బ్యాంక్ నిండా పైసలున్నా.. అవసరానికి వాడుకోలేని దుస్థితిలో ఉన్నారు వాళ్లు. సర్కార్ ఆంక్షల నడుమ బతుకుతున్న ఎరిట్రియా దేశ ప్రజల బతుకు చిత్రం ఎట్లా ఉందో చూద్దాం..
ఆఫ్రికా ఖండానికి ఈశాన్య దిశలో ఉంది ఎరిట్రియా దేశం. ఒకప్పుడు ఇది ఇటలీ ఆధీనంలో ఉండేది. తర్వాతి కాలంలో ఇథియోపియా కింద ఉండేది. 1993లో ఎరిట్రియాకు స్వాతంత్య్రం దక్కింది. అప్పటి నుంచి ఇక్కడ ఒకే పార్టీ అధికారంలో ఉంది. పీపుల్స్ ఫ్రంట్ ఫర్ డెమొక్రసీ అండ్ జస్టిస్ పార్టీ నేత ఇసాయిస్ అఫ్వెరిక్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ జనాభా లెక్కలు కూడా చేపట్టకపోవడంతో పాపులేషన్ ఎంతన్నది క్లారిటీ లేకుండా ఉంది. అయితే ఎరిట్రియాలో ఉన్న రిస్ట్రిక్షన్స్ బహుశా ఏ దేశంలోనూ కనిపించవేమో!. ప్రాథమిక హక్కులు, రెలిజియస్ ఫ్రీడం కనిపించవు ఇక్కడ. ఆ భయంతోనే చాలా మంది ఈ దేశం విడిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎరిట్రియా సర్కార్ అందుకు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో సీక్రెట్ రూట్స్లో పారిపోతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా.
ఇదేం ఇంటర్నెట్!
ఎరిట్రియా దేశం మొత్తం మీద ఇంటర్నెట్ వాడేవాళ్లు ఆరు శాతం మాత్రమే ఉన్నారు. అందుకు కారణం అక్కడున్న ఆంక్షలు. ఇక్కడ కేవలం ఒకే ఒక్క టెలికాం కంపెనీ పని చేస్తుంది. అది కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఎరిటెల్(EriTel). సిమ్ కార్డ్ కోసం గవర్నమెంట్కు అర్జీ పెట్టుకోవాలి. రోజుల తరబడి ఎదురు చూడాలి. అయినా వస్తుందనే నమ్మకం లేదు. అందుకే ఇప్పటికీ అక్కడ పబ్లిక్ ఫోన్బూతులు కనిపిస్తుంటాయి.
ఎరిటెల్ సర్వీస్ చాలా పూర్గా ఉంటుంది. పైగా చాలా రిస్ట్రిక్షన్స్తో యూజర్స్ని సతాయిస్తుంది. అయినా కూడా కొత్త టెలికాం కంపెనీకి పర్మిషన్ ఇవ్వరు. చచ్చినట్లు అదే వాడాలి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సిమ్తో మొబైల్ డేటా కూడా రాదు. వైఫై ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్పై గవర్నమెంట్ సెన్సార్షిప్ ఉంది. అందుకే ఇక్కడి యూత్ ‘వీపీఎన్’(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సాయంతో ఫేస్బుక్, ట్విటర్ను వాడుకుంటారు. లోన్లీ కంట్రీగా ఎరిట్రియాలో అసలు అక్కడేం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి.
సొంత డబ్బుపై ఆంక్షలు
బ్యాంకులు ఉంటాయి. వాటిలో డబ్బులు దాచుకోవచ్చు. కానీ, విత్ డ్రా చేసుకోవడానికి మాత్రం లిమిట్ ఉంటుంది. నెలలో కేవలం 330 డాలర్లు (ఎరిట్రియా కరెన్సీలో ఐదు వేల నక్ఫాలు) మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ డబ్బు అవసరం పడితే ఎలాగంటారా?. దానికి ఒక మార్గం ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఒక లెటర్ ద్వారా అర్జి పెట్టుకోవాలి. అక్కడి నుంచి బ్యాంక్కి లెటర్ వెళ్తే.. డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఈ రూల్ ఎందుకు విధించిందో అనే విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వానికి, ప్రజలకు కూడా క్లారిటీ లేకపోవడం విశేషం.
ఎంటర్టైన్మెంట్ పరిస్థితి అంతే!
వరల్డ్ మోస్ట్ సెన్సార్డ్ కంట్రీగా ఎరిట్రియాకి పేరుంది. అపొజిషన్ పార్టీలపైనే కాదు.. మీడియా మీద కూడా ఇక్కడ ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ ఒకే ఒక్క టీవీ స్టేషన్ ఉంది. దాని పేరు ఎరీ–టీవీ. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఇది నడుస్తుంది. రేడియో స్టేషన్ల పరిస్థితి మరీ దారుణం. అయితే ఎరిట్రియా గవర్నమెంట్ మాత్రం 91 శాతం ఇళ్లకు శాటిలైట్ డిషెస్ ఉన్నాయని, ఆరువందల చానెల్స్కి పైగా టెలికాస్ట్ అవుతున్నాయని చెప్తోంది. సరదాగా మందు తాగాలన్నా ఇక్కడ కష్టమే. ఒక బార్లో రెండు బీర్లు మాత్రమే తాగడానికి పర్మిషన్ ఉంది ఇక్కడ. ఒకవేళ ఆ లిమిట్ దాటి తాగాలంటే.. తాగుడు అలవాటు లేనివాళ్లను వెంటపెట్టుకుని వెళ్లి వాళ్ల కోటాలో మందేసే మందుబాబులు ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఇటలీ ఇంజినీర్ టూయిగి మెలోటియా 1939లో అస్మారా కంపెనీని నెలకొల్పాడు. ఎరిట్రియాలో ఇప్పటి వరకు ఇదొక్కటే బ్రేవర్ కంపెనీ.
వలస కల!
ఇక్కడి రిస్ట్రిక్షన్స్ భరించలేక వేరే దేశాలకు వలస వెళ్లాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే పాస్పోర్ట్ వాళ్లకు ఒక కలగానే మిగిలిపోతోంది. నేషనల్ సర్వీస్(మిలిటరీ ట్రైనింగ్) పూర్తయ్యేదాకా యువకులకు పాస్పోర్ట్ ఇవ్వరు. పాస్పోర్ట్కు అప్లై చేయాలన్నా లోకల్ గవర్నమెంట్ ఆఫీసుల నుంచి లెటర్ తెచ్చుకోవాలి. కానీ, అది జరిగే పని కాదు. ఒకవేళ అన్ని ఆటంకాలు దాటి పాస్పోర్ట్ వచ్చినా ఎగ్జిట్ వీసా రాదు. ఒక్కసారి బయటకు వెళ్తే తిరిగి మళ్లీ దేశానికి రారనే భయంతో ఎరిట్రియా సర్కార్ ఈ తరహాలో టఫ్ రూల్స్ విధించింది. అందుకే ఈ దేశానికి ‘ఆఫ్రికన్ నార్త్ కొరియా’ అనే పేరుంది. చాలా మంది దొడ్డిదారిన దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. సహారా ఎడారి, మధ్యధరా సముద్రం దాటి ప్రయాణించి యూరప్ చేరుకుంటారు. ఈ ప్రయాణంలో ప్రాణాలు పొగొట్టుకున్నవాళ్లు వేలలోనే ఉన్నారు.
అదొక్కటే అందం
పొలిటికల్గా, ఎకనామికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ.. రాజధాని ఆస్మారా సిటీ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇటలీ ఫాసిస్ట్ నియంత బెనిటో ముస్సోలిని బాగా ఇష్టపడ్డాడు. ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్ది ఆఫ్రికా ‘లిటిల్ రోమ్’గా తయారు చేయాలనుకున్నాడు. 1930లో ఒక ప్లానింగ్ కూడా అమలు చేశాడు. అందుకే ఇక్కడి బిల్డింగ్లు చాలా అందంగా ఉంటాయి. ఇటాలియన్ వలసరాజ్య పాలనను అవి గుర్తు చేస్తాయి. యూఎన్ కల్చరల్ ఏజెన్సీ యునెస్కో అస్మారా సిటీని ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’గా ప్రకటించింది. టూరిజం పరంగా ఆకట్టుకునే ఎన్నో ప్రాంతాలు ఈ దేశంలో ఉన్నాయి కూడా.