లవర్ బోయ్ ఇమేజ్ నుంచి బైటపడి డిఫరెంట్ కానెస్ప్ట్ తో మెప్పించే ప్రయత్నం చేస్తున్న నాగశౌర్య.. స్పోర్ట్స్ డ్రామా లక్ష్య తో ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా శార్య చెప్పిన సంగతులు.
‘‘దర్శకుడు సంతోష్ ఫస్టాఫ్ చెప్పడానికే నాలుగ్గంటల సమయం తీసుకున్నాడు. ఎంత రీసెర్చ్ చేశాడో అర్థమై వెంటనే ఓకే చెప్పేశాను. ఆ తర్వాతి రోజు సెకెండాఫ్ విన్నాను. ఇందులో కొత్త శౌర్యని చూపించాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథలు చాలా అరుదు. ఇలాంటివి వస్తే నేనే కాదు...నా ప్లేస్లో ఎవరున్నా బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. పురాణాల్లోని వారినే కాదు.. చరిత్రలో అల్లూరి లాంటి వీరుల్ని చూసినా వారి చేతిలో బాణం కంపల్సరీ. ఆటల్లో ఆర్చరీని మాత్రమే విలువిద్య అంటారు. అంటే దీన్ని ఎడ్యుకేషన్తో పోలుస్తారు. కానీ మనం దీన్ని దూరం చేసుకుంటున్నాం. ఈ సినిమా ద్వారా ఇది మన గేమ్ అని చూపిస్తున్నాం. ముప్ఫై ఐదు కేజీల బరువున్న ధనుస్సు పట్టుకుని బాణాన్ని సంధించడం ఈజీ కాదు. అందుకే త్రీ డేస్ ట్రైనింగ్ తీసుకున్నా. బ్యాడ్ హాబిట్స్ మార్చుకుని మనల్ని మనం గెలిస్తే కానీ ప్రపంచాన్ని గెలవలేమని చెప్పే సినిమా ఇది. ఎయిట్ ప్యాక్లో కనిపిస్తా. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలే బాడీ మెయింటెయిన్ చేసేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా చాలామంది యాక్టర్స్ ఫిట్నెస్పై ఫోకస్ పెట్టారు. మన సత్తా చూపించే టైమ్ వచ్చినప్పుడు చూపించాలి. అందుకే నేనూ ఎయిట్ ప్యాక్ ట్రై చేశా. తొమ్మిది రోజుల పాటు అసలు నీళ్లే తాగలేదు. నా కష్టం తెరపై కనిపిస్తుంది. ప్రస్తుతం మా బ్యానర్లో అనీష్ కృష్ణ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాను. తొంభై శాతం షూటింగ్ పూర్తయింది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. మొదటిసారి బ్రాహ్మిణ్ క్యారెక్టర్లో కనిపిస్తాను. ఇక శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో చేస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నా మనసుకెంతో దగ్గరైన సినిమా. ఏడు వేరియేషన్స్లో కనిపిస్తాను. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నాననే రూమర్ వినిపిస్తోంది. నిజంగా ఆ చాన్స్ వస్తే బాగుంటుంది. ఇంకోసారి లాక్డౌన్ కనుక పెడితే పెళ్లి చేసేసుకుంటాను (నవ్వుతూ).