టాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda). కమెడియన్గా టాలెంట్ ప్రూవ్ చేసుకుని.. ఇపుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్, 35 చిన్న కథకాదు, కోర్ట్ తదితర సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు.
ఈ క్రమంలోనే ‘ప్రేమంటే (Premante) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇవాళ శుక్రవారం (2025 నవంబర్ 21న) ప్రేమంటే మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీలో ప్రియదర్శి సరసన ఆనంది (Anandhi) హీరోయిన్గా నటించింది. సుమ కనకాల కీలక పాత్ర పోషించింది.
కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. 'థ్రిల్ యు ప్రాప్తిరస్తు' అనే ట్యాగ్లైన్తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎలా ఉంది? ప్రియదర్శికి ఖాతాలో హిట్ పడిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం
కథేంటంటే:
పెళ్లి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్గా ఉండాలని కోరుకునే అమ్మాయి రమ్య (ఆనంది). అతి శుభ్రత అనే ఓ డిజార్డర్ ఉంటుంది. రమ్యకు థ్రిల్లింగ్ అనిపించే పనులు చేయాలంటే ఇష్టం. చదువు కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేస్తుంటుంది. మరోవైపు, తన కుటుంబం కోసం ఏమైనా చేయాలనే మనస్థత్వంతో ఉంటాడు మధుసూదన్ అలియాస్ మధి (ప్రియదర్శి). వీరిద్దరి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి.పెళ్లి తర్వాత తమ లైఫ్ ఎలా ఉండాలో వీరిద్దరు ముందే ఊహించుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే తమ ఇంట్లో పెద్దవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తూ వస్తుంటారు రమ్య, మధుసూదన్. అలా ఓ పెళ్లిలో అనుకోకుండా రమ్య, మధుసూదన్లు కలుస్తారు. తర్వాత వారి అభిప్రాయాలూ, ఇష్టాలు, ఆలోచనలు కలుస్తాయి. ఇక వారిద్దరి మధ్య అన్నీ కలిసి రావడంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. అలా వారు ఊహించినట్టుగానే తమ కలల సామ్రాజ్యంలోకి అడుగుపెడతారు. మూడు నెలలు వివాహ జీవితం సజావుగా సాగుతుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరి ప్రవర్తనలో మార్పులు వస్తాయి.
ఈ క్రమంలోనే రమ్య తన భర్త మధుసూదన్ గురించి ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటుంది. దాంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. ఇక మధుసూదన్ నుంచి రమ్య వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. చివరగా భర్త మధుసూదన్కు మారడానికి.. ఒక్క అవకాశం ఇస్తుంది. మరొక సంఘటన తర్వాత, రమ్య ఒక ఊహించని డెసిషన్ తీసుకుంటుంది. అది మధుసూదన్కు బిగ్ షాక్ ఇస్తుంది.
అసలు రమ్య తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? మధుసూదన్ చేసే పని ఏంటీ? ఆ పని గురించి తెలిశాక రమ్య ఎలా స్పందించింది? హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ (సుమ).. వీరి మధ్యలోకి ఎలా రావాల్సి వచ్చింది? పెళ్లి తర్వాత వీరి ఊహించిన జీవితం ఎందుకు తలక్రిందులు అయింది? మొత్తానికి వీరిద్దరి వైవాహిక జీవితానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇద్దరి మధ్య బంధం కొనసాగిందా? లేదా? అన్నది తెలియాలంటే ప్రేమంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
పెళ్లికు ముందు కలల ప్రపంచం. ఆ తర్వాత ఊహించిన ప్రేమకథ, ఆపై పెళ్లి. కానీ, వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత అనూహ్య మార్పులు, ఊహించని సంఘటనలు. అలా ఓ కొత్త జంట మధ్య ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలతో.. జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ప్రేమంటే ఓవరాల్ కథ. ఈ సినిమా ఓ విధంగా హీరోయిన్ కథ అని చెప్పొచ్చు. ఈ కథకు ప్రధానమైన సోల్ హీరోయిన్ పాత్రే. ఎందుకంటే.. పెళ్లి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్గా ఉండాలని హీరోయిన్ కోరుకుంటుంది. కానీ, దానికి విరుద్ధంగా తన లైఫ్ సాగుతుంది. ఎన్నో కలలతో ఇష్టపడిన వాడ్ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. కానీ, లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది.
పెళ్ళికి ముందు ప్రేమ వేరు. ప్రేమలో కొన్ని దాగుడుమూతలు ఆటలుంటాయి. కొన్ని నిజాలు దాచిపెడుతుంటాం. కానీ, ప్రేమ తర్వాత పెళ్లివేరు. కలిసి జీవితం పంచుకుంటాం. అంటే, ఎలాంటి దాపరికం లేకుండా మనసులు ముడేసుకుంటాం. అలా వివాహ బంధం మొదలుపెట్టాక ఒకరికొకరికి అన్నీ తెలిసిపోతాయి. తప్పొప్పులు అయితే, మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలో భర్తలో కొత్త మార్పులు వచ్చినప్పుడు, భార్య ఎంచుకున్న మార్గం ఎలాంటిది అనేది ప్రేమంటే మూవీ.
అనుమానానికి దారీ తీసే మార్పులు ఏంటంటే.. ఫోన్ రాగానే భర్త బయటకు వెళ్లి మాట్లాడటం, ఆ విషయం భార్యలో అనుమానాన్ని రేకెత్తించడం, ఇరుగు పొరుగు ఆ అనుమానానికి ఆజ్యం పోయడం వంటివి. కానీ, ఇలాంటివి ఉంటూనే.. ఆలోచింపజేసే కథతో నడుస్తుంది ప్రేమంటే..
ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత, వారి మధ్య నెలకొన్న సమస్యలు, భావోద్వేగాలు ఇందులో చక్కగా ప్రజెంట్ చేశారు. భర్త దొంగగా మారితే.. ఏ భార్య అయిన.. అతన్ని (భర్తను) మార్చుకోడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ మూవీలో భార్య అలా కాదు. భర్త దొంగని తెలిసి.. భర్త సమస్యలను అర్థం చేసుకొని.. భర్తకు సాయంగా తాను కూడా దొంగలా మారుతుంది. భర్త బలహీనతను, తాను చేసే ఎథికల్ దొంగతనాలకు సపోర్ట్ చేసి, తన వెంట ప్రయాణం సాగిస్తుంది.
ఫస్టాఫ్ విషయానికి వస్తే.. హీరో, హీరోయిన్ల పాత్రల పరిచయం, కొన్ని కామెడీ స్కీన్లతో మొదలవుతుంది. ఆ తర్వాత పెళ్లి, అనుమానాలు, గొడవలు వంటి సీన్స్తో ఫస్టాఫ్ బాగానే వర్కౌట్ అయింది. సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజనెస్ చేసే మధి రాత్రి సమయంలో తన టీమ్తో దొంగతనాలు చేస్తూ ఉండే సీన్స్ ఆసక్తిగా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్, భార్య పాత్ర ఇచ్చే ట్విస్ట్ థ్రిల్ ఇస్తుంది.
సెకండాఫ్ విషయానికి వస్తే.. భార్య భర్తల మధ్య వచ్చే ఎమోషన్స్ కీలకం. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కొంచెం ప్రిడిక్టబుల్గా సాగడం కాస్తా నిరాశపరుస్తుంది. కానీ, భర్త కోసం భార్య చేసే దొంగతనాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇందులో హీరోయిన్కి అతి శుభ్రత అనే డిజార్డర్ ఉంది కనుక.. దొంగతనం చేసిన చోటల్లా అక్కడి ఇంటిని శుభ్రంగా తుడవడం.. సొంత ఇంట్లో వండుకున్నట్టు అక్కడ బిర్యానీ వండుకోని తినడం సీన్స్ విపరీతమైన కామెడీ పంచుతుంది. హీరో కూడా ఒక చోట దొంగతనం చేయడానికి ముందు టెక్నాలజీ యూజ్ చేసిన కెమెరాలు పనిచేయకుండా చేయడం.. అది కూడా బ్లాక్ మనీ ఉన్న వాళ్ల ఇంట్లోనే దొంగతనాలు చేస్తున్నట్టు చూపించడం ఆసక్తి కలిగిస్తాయి.
ఇకపోతే.. భార్యాభర్తలు విడిపోయే సందర్భం, పుట్టింటి నుంచి బయటికొచ్చి మళ్లీ తాను చేయాలనుకున్నది చేసే మాత్రం ఆకట్టుకుంటాయి. అలాగే, హెడ్ కానిస్టేబుల్ ఆశామేరీ (సుమ కనకాల), సీఐ సంపత్ (వెన్నెల కిశోర్)తో పాటు, కానిస్టేబుల్స్ పాత్రల్లో కనిపించే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తదితరులు కలిసి చేసే సందడి హైలెట్గా నిలిచింది. ఈ పోలీసు మొత్తం బృందం.. భార్య భర్తలు చేసే దొంగతనాలను పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్.. రోటీన్ ప్రేమ కథలు కాకుండా.. ప్రేమంటే సినిమాను వినూత్నంగా తీర్చీదిద్దే ప్రయత్నం చేశాడు. తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి సక్సెస్ అయ్యాడు.
ఎవరెలా నటించారంటే:
హీరో ప్రియదర్శి మధుసూదన్ పాత్రలో ఒదిగిపోయాడు. తన మార్క్ నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. మల్లేశం, బలగం, కోర్ట్, సారంగపాణి లాంటి కథలన్నీ కామన్ మ్యాన్ నుంచి వచ్చినవే. ఈ కథ కూడా సాధారణ జీవితానికి సంబంధించి అవ్వడంతో.. ప్రియదర్శి మరింత దగ్గరవుతాడు. హీరోయిన్ ఆనంది పాత్రకు మరింత గుర్తింపు వస్తుంది. రమ్య పాత్రలో తన సహజ నటన ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి కంటే ఆనందికే ఎక్కువ మార్కులు పడతాయి. సుమ కనకాల తనదైన కామెడితో అదరగొట్టింది. ఆది, వెన్నెల కోశోర్, ఆటో రామ్ ప్రసాద్ తమ పంచులతో అలరించే ప్రయత్నం చేశారు.
