పొట్టి వీరయ్య వైకల్యాన్ని జయించిన వీరుడు 

పొట్టి వీరయ్య వైకల్యాన్ని జయించిన వీరుడు 
  • కడసారి నివాళులర్పించి కంటతడిపెట్టుకున్న రాజశేఖర్, జీవిత దంపతులు 

హైదరాబాద్: పొట్టి వీరయ్య వైకల్యాన్ని జయించిన వీరుడని, తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయిందని ప్రముఖ కథా నాయకుడు రాజశేఖర్, జీవిత దంపతులు పేర్కొన్నారు. సోమవారం వీరు చిత్రపురి కాలనీకి వెళ్లి పొట్టి వీరయ్య భౌతిక కాయాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు చిరపరిచితుడైన గట్టు వీరయ్య కుటుంబ సభ్యులను వారు పరామర్శించి ఓదార్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా సినిమాల్లో నటించిన వీరయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్, జీవిత దంపతులు మాట్లాడుతూ "వీరయ్య గారు తెలియని వాళ్లు లేరు. అగ్ర హీరోలు అందరితోనూ నటించారు. మాతోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన వైకల్యాన్ని జయించిన వీరుడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జనరల్ బాడీ సమావేశాలు కానివ్వండి, అవార్డు ఫంక్షన్స్ కానివ్వండి...ఏ కార్యక్రమానికి పిలిచినా సరే తప్పకుండా హాజరు అయ్యేవారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. మేం పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పరిశ్రమలో ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణం బాధ కలిగించింది. ఆ కుటుంబానికి మాకు వీలైనంత సహాయం చేయాలని అనుకుంటున్నాం"  అని అన్నారు.