
‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ కావడంతో ఫుల్ జోష్లో ఉన్నాడు రామ్ చరణ్. ‘ఆచార్య’ నిరాశపర్చినప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ముందు అది తేలిపోయింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న చరణ్, మరో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్తోనూ సినిమా చేయనున్నట్టు ప్రచారంలో ఉంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ తీసిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ సూపర్ సక్సెస్ సాధించింది. వారం రోజులు నిలకడ వసూళ్లు రావడమే కష్టమవుతున్న సమయంలో ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్ కలెక్షన్స్ స్టడీగానే ఉండటం విశేషం. అలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ తన తాజా ఇంటర్వ్యూలో చరణ్తో సినిమా గురించి ఓపెన్ అయ్యాడు. ‘ఈమధ్యనే చరణ్ సర్ని కలిశాను. ఆయన ఆతిథ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయనతో నేను ఒక సినిమా చేస్తే కచ్చితంగా అది ఓ ప్రెస్టీజియస్ మూవీనే అవుతుంది. కానీ నాకిప్పుడు రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆయనకి కూడా వరుస కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక కలిసి వర్క్ చేస్తాం’ అన్నాడు. మొత్తానికి కొన్నేళ్లు టైమ్ పట్టొచ్చు కానీ చరణ్తో సినిమా అయితే ఉంటుందని తేల్చేశాడు లోకేష్. ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నాడు చరణ్. కియారా అద్వానీ, అంజలి, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర, సముద్రఖని లాంటి పలువురు యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. ఇప్పుడీ వరుసలో ఎస్.జె.సూర్య కూడా చేరినట్టు తెలుస్తోంది. ఇందులో తాను సీఎం కొడుకుగా నటిస్తున్నట్టు ఇటీవల రివీల్ చేశాడు సూర్య. ఇది నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్ర అని సమాచారం.