మన్మథ, వల్లభ లాంటి చిత్రాలతో టాలీవుడ్లోనూ క్రేజ్ పెంచుకున్నాడు కోలీవుడ్ హీరో శింబు. ఇటీవల ‘మానాడు’తో మెస్మరైజ్ చేసిన శింబు.. త్వరలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రానున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ‘వెందు తుణీందదు కాడు’ చిత్రం సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న మూడో మూవీ కావడంతో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు శింబు హీరోగా ఒబెలి ఎన్ కృష్ణ తెరకెక్కించిన ‘పత్తు తల’ కూడా రిలీజ్కి రెడీ అయ్యింది. రూరల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాని డిసెంబర్ 14న విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇందులో కార్తీక్ కొడుకు గౌతమ్ మరో లీడ్ రోల్ చేశాడు. పెన్ స్టూడియోస్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్పై జయంతీలాల్ గడ, జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలకీ ఏ.ఆర్.రెహమానే సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ రెండింటి కంటే ముందు ‘మహా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక లీడ్ రోల్ చేసిన ఈ చిత్రంలో శింబు ఒక కీలక పాత్రలో నటించాడు. అంటే మూడు నెలల్లో మూడు సినిమాలతో ఫ్యాన్స్ని అలరించనున్నాడు శింబు.