- జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం
- మల్కాజిగిరి కార్పొరేటర్ వేసిన పిటిషన్పై వాదనలు
- సమావేశాల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు
- విచారణ ఈ నెల 12కి వాయిదా
హైదరాబాద్, వెలుగు: కౌన్సిల్ మీటింగ్ నిర్వహించకపోతే కౌన్సిల్ను రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌన్సిల్ మీటింగ్ను నిర్వహించాలని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఈ నెల 1న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. జీహెచ్ఎంసీ తీరుపై మండిపడింది. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించకపోతే రద్దు చేయొచ్చు కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఏయూడీ స్టాండింగ్ కౌన్సిల్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటుపై వివరణ ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల12కి వాయిదా వేసింది.
ఇయ్యాల బల్దియా అఖిలపక్ష సమావేశం
జీహెచ్ఎంసీ అఖిలపక్ష సమావేశం మంగళవారం బల్దియా హెడ్డాఫీసులో జరగనుంది. ఉదయం11.30 గంటలకు సమావేశానికి రావాలంటూ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆహ్వానించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ మీటింగ్ నిర్వహణ తేదీతో పాటు ఏయే సమస్యలపై చర్చ జరగాలో నిర్ణయించనున్నారు. కార్పొరేటర్ శ్రవణ్ వేసిన పిటిషన్పై హైకోర్టులో సోమవారం వాదనలు జరిగిన కొద్ది గంటల్లోనే మేయర్ అఖిలపక్ష సమావేశానికి సభ్యులను ఆహ్వానించారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు.