
- సిట్ దర్యాప్తు పూర్తయ్యే దాకా ఎగ్జామ్ను వాయిదా వేయాలని 3 పిటిషన్లు
- యూపీఎస్సీ లాంటి సంస్థల ద్వారా గ్రూప్ 1 నిర్వహించాలని విజ్ఞప్తి
- పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం
- విచారణ ఈ నెల 5కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు పూర్తయ్యే దాకా గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. లీకేజీ ఆరోపణలు టీఎస్పీఎస్సీపై ఉన్నాయని, ఇప్పుడు అదే కమిషన్ పరీక్షలను నిర్వహిస్తోందని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ వంటి మూడో సంస్థ ద్వారా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పేపర్ల లీకేజీ విషయం వెలుగులోకి రావడంతో గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన పరీక్షలను రద్దు చేయడంతోపాటు ఈ నెల 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ విడివిడిగా 3 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై గురువారం జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు. టీఎస్పీఎస్సీకి నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయా లని ఆదేశిస్తూ.. విచారణను 5కి వాయిదా వేశారు.
విశ్వసనీయత కోల్పోయిన కమిషన్ పరీక్షలు నిర్వహించడమా?
పేపర్ల లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఇప్పటికే 40 మందిని అరెస్టు చేసిందని, అరెస్టు ల సంఖ్య వందకు చేరే అవకాశం లేకపోలేదని పిటి షనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. సి ట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దు చేసి, 11న నిర్వహించడానికి కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ‘‘పేపర్ల లీకేజీ బాగోతంలో టీఎస్పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. తిరిగి అదే కమిషన్ పరీక్షలు నిర్వహించడం అన్యాయం. విశ్వసనీయత కోల్పోయిన కమిషన్ పరీక్షలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలి. కమిషన్ ఉద్యోగుల పాత్ర ఏమిటో తేలాల్సి ఉంది. సిట్ దర్యాప్తు అయ్యే వరకు పరీక్షలను వాయిదా వేసేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి” అని కోరారు. టీఎస్పీఎస్సీ ద్వారా పరీ క్షల నిర్వహణ చేయరాదని, ఆ బాధ్యతను యూపీఎస్సీ లాంటి సంస్థకు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాల ని కోరారు. నిందితులందరూ ఇంకా బయటపడలేదని, అయినా పరీక్ష నిర్వహించడానికి కమిషన్ తొందరపడుతోందన్నారు. ఎన్ఆర్ఐల కోసం పరీక్షలను నిర్వహించేందుకు శ్రద్ధ చూపుతోందని ఆరోపించారు. పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇస్తే అధికారుల నుంచి స్పందన లేదన్నారు.
నలుగురిని సస్పెండ్ చేశాం: టీఎస్పీఎస్సీ లాయర్
టీఎస్పీఎస్సీ లాయర్ ఎం.రాంగోపాల్ రావ్ వాదనలు వినిపిస్తూ.. లీకేజీ వ్యవహారంలో కమిషన్కు చెందిన ఇద్దరు పర్మినెంట్, ఇద్దరు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్పై ఆరోపణలు రాగా.. వాళ్లను సస్పెండ్ చేశారని చెప్పారు. ఇప్పటికే 994 సెంటర్లలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించి చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారి, అసిస్టెంట్ కంట్రోలర్లను ప్రభుత్వం నియమించిందని చెప్పారు.