హైదరాబాద్, వెలుగు: మెడికో ప్రీతి మృతి వ్యవహారంలో సీనియర్ స్టూడెంట్ సైఫ్ అలీ వాదనలు విన్నాకే అతని సస్పెండ్ పై నిర్ణయం తీసుకోవాలని వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. సైఫ్ అలీ తన స్నేహితులతో కలిసి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చినందుకే ప్రీతి మృతిచెందిందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా సైఫ్ను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దాంతో సైఫ్ హైకోర్టును ఆశ్రయించాడు.
సస్పెండ్ నిర్ణయం తీసుకునేముందు తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని పిటిషన్ లో తెలిపాడు. అందుకే కోర్టుకు వచ్చినట్లు వివరించాడు. అతని పిటిషన్ను జస్టిస్ ఎస్.నంద మంగళవారం విచారించారు. సైఫ్ వాదనలు వినాలని, ఆ తర్వాతే సస్పెండ్ చేయడంపై తగిన నిర్ణయం తీసుకోవాలని కాలేజీకి ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్పై విచారణ ముగిసినట్లుగా పేర్కొన్నారు.