
- రిటర్న్ ఎక్కువున్న చోటే రిస్క్ కూడా ఉంటుంది
- ‘డిపాజిటర్లు ఫస్ట్’ ఈవెంట్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: ఎక్కువ రిటర్న్స్ వచ్చే చోట ఎక్కువ రిస్క్ కూడా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. లాభాలు ఎక్కువగా వచ్చే అసెట్లలో డబ్బులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహాయిచ్చారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ‘డిపాజిటర్స్ఫస్ట్’ ఈవెంట్లో మాట్లాడుతూ కామెంట్ చేశారు. ‘డిపాజిటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఎక్కువ రిటర్న్ లేదా వడ్డీ, రిస్క్ ఎక్కువగా ఉన్నచోటే ఉంటుంది’ అని చెప్పారు. బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయని డిపాజిటర్లు తమ డబ్బులను పెట్టొద్దు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహాయిచ్చారు. కొన్ని సంస్థలు మాత్రం తక్కువ రిస్క్తో ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ డిపాజిటర్లు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండడం ముఖ్యమన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థను పెంచేందుకు కలసి రావాలి...
బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలపరిచేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని దాస్ అన్నారు. కానీ, ఇది జరగాలంటే అందరూ కలిసి రావాలన్నారు. ‘బ్యాంక్ మేనేజ్మెంట్, బ్యాంకు బోర్డులు, ఆడిట్ కమిటీ, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ లేదా ఇతర రెగ్యులేటరీ సంస్థలు వంటివి అన్నీ కలసి రావాలి. ఇది మన అందరి బాధ్యత’ అని దాస్ పేర్కొన్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అమౌంట్ను చెల్లించడం చివరి అస్త్రం మాత్రమే కావాలని ఆయన పేర్కొన్నారు. రెగ్యులేటరీ గైడ్లైన్స్ను, సూపర్వైజరీ విధానాలను మెరుగుపరచడానికి ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంటోందని, బ్యాంకుల పనితీరును మెరుగుపరిచే చర్యలపై ఫోకస్ చేశామని అన్నారు. తాజా మానిటరీ పాలసీ మీటింగ్లో చేసిన స్టేట్మెంట్ను ఆయన గుర్తు చేశారు. ‘కరోనా సంక్షోభం టైమ్లో దేశం మొత్తం కలిసి పనిచేసిందని చెప్పాను. వరల్డ్ ఎకానమీని మన ఎకానమీ నడిపే టైమ్ వచ్చింది’ అని అన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్లోని అందరూ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని దాస్ పేర్కొన్నారు.
బ్యాంకింగ్ సిస్టమ్పై నమ్మకం పెరిగింది...
డిపాజిట్ ఇన్సూరెన్స్ చట్టాన్ని తీసుకురావడం వలన అకౌంట్ హోల్డర్లకు బ్యాంకింగ్ సిస్టమ్పై నమ్మకం పెరిగిందనిఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ బిల్లు (సవరించిన) , 2021 ను పార్లమెంట్ ఈ ఏడాది అగస్ట్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం, బ్యాంకులు ఫెయిలైతే వాటిపై ఆర్బీఐ మారటోరియాన్ని విధించినప్పటి నుంచి 90 రోజుల్లో అకౌంట్ హోల్డర్కు రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందుతుంది. ‘డిపాజిటర్లకు ప్రాధాన్యం ’ అనే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. గత కొన్ని నెలల్లో ఒత్తిడిలోని బ్యాంకులకు చెందిన లక్ష మంది కస్టమర్లు రూ. 1,300 కోట్లను పొందారని అన్నారు. మరో 3 లక్షల మంది కస్టమర్లకు కూడా త్వరలో డిపాజిట్స్ అందుతాయని చెప్పారు. బ్యాంకులు వృద్ధి చెందడానికి డిపాజిటర్ల డబ్బులను రక్షించడం ముఖ్యమని మోడీ పేర్కొన్నారు.
మరో మూడేళ్లు పదవిలో..
ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ పదవీకాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడగించిన విషయం తెలిసిందే. ఈ పొడిగించిన టైమ్ ఈ నెల 10 నుంచి స్టార్టయ్యింది. గత 20 ఏళ్లలో ఆర్బీఐ గవర్నర్ల పదవీ కాలాన్ని రెండేళ్లు మాత్రమే పొడిగించారు. కానీ, దాస్ పదవీ కాలాన్ని మాత్రం మూడేళ్ల పాటు పెంచారు. మోడీ నాయకత్వంలోని కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్గా దాస్ పనితీరు బాగుందని ఎనలిస్టులు అంటున్నారు. కరోనా టైమ్లో దేశ ఎకానమీని గట్టెక్కించడానికి ఆయన నాయకత్వంలోని ఆర్బీఐ 100 చర్యలను ప్రకటించింది. దాస్ 2018 డిసెంబర్లో మొదటిసారిగా ఆర్బీఐ గవర్నర్గా నియమితులయ్యారు. ఇలా పదవీ కాలాన్ని పెంచుకున్న ఐదో ఆర్బీఐ గవర్నర్గా ఆయన నిలిచారు. మొత్తం మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తే ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రెండో గవర్నర్గా ఆయన నిలుస్తారు. మొదటి ప్లేస్లో బెనెగల్ రామా రావ్ ఉన్నారు. ఆయన జులై 1, 1949 నుంచి జనవరి 14, 1957 వరకు అంటే 7 ఏళ్ల 197 రోజులు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు.