ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్తత నెలకొంది.డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులు . నర్సంపేట నుంచి మల్లంపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ బాడిని తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.అయితే శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపోకు తీసుకెళ్తామని తోటి ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తుండటంతో ఆర్టిసి JAC నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్ చేసిన నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గురువారం తెల్లవారు జామున 2.30 గంటలకు మృతి చెందినట్టు కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. గురువారం ఆర్టీసీ సమ్మె సందర్భంగా శంకర్ నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేసిన విషయం తెలిసిందే. మొదట వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హుటాహుటిన కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో తెల్లవారు జామున శంకర్ మృతిచెందాడు.శంకర్ గౌడ్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసేందుకు పిలుపునిచ్చారు.

