హైదరాబాద్‌‌, బెంగళూరు, చెన్నైలలోనే ఆఫీస్ స్పేస్‌‌కు ఎక్కువ డిమాండ్‌‌

హైదరాబాద్‌‌, బెంగళూరు, చెన్నైలలోనే ఆఫీస్ స్పేస్‌‌కు ఎక్కువ డిమాండ్‌‌
  •    నార్త్‌‌, వెస్ట్ సిటీల కంటే సౌత్‌‌లోనే ఫుల్ గిరాకీ
  •     ఐటీ సెక్టార్ విస్తరించడమే కారణం


 కరోనా టైమ్‌‌లో ఐటీ సెక్టార్‌‌‌‌కు ఫుల్‌‌ డిమాండ్‌‌ క్రియేట్ అవ్వడంతో దక్షిణాది రాష్ట్రాల్లోని సిటీలు బాగా లాభపడ్డాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌‌ పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్‌‌, చెన్నై సిటీలలో ఆఫీస్‌‌ స్పేస్‌‌కు బాగా గిరాకీ పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో టాప్ ఏడు సిటీల్లో నికరంగా 2.13 కోట్ల చదరపు అడుగుల (చ.అ.) స్పేస్‌‌ లీజు కిందకు వెళ్లింది. ఇందులో 66 శాతం వాటా  బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌‌ల నుంచే ఉంది. ముంబై మెట్రోపాలిటిన్‌‌ రీజియన్‌‌ (ఎంఎంఆర్‌‌‌‌), పుణె (వెస్ట్‌‌) ల వాటా 21 శాతంగా ఉండగా, ఎన్‌‌సీఆర్‌‌‌‌ (నార్త్‌‌) వాటా 11 శాతంగా ఉంది. 2017–18 లో టాప్ ఏడు సిటీలలో 3.1 కోట్ల చ.అ.  ఆఫీస్‌‌ స్పేస్‌‌ను లీజ్‌‌కు ఇచ్చారు. ఇందులో దక్షిణాది సిటీల వాటా 47 శాతంగా ఉంది. 2020–21 నాటికి ఈ వాటా 66 శాతానికి పెరిగింది.  కొత్త ఆఫీస్‌‌ స్పేస్‌‌ను సప్లయ్ చేయడంలో కూడా దక్షిణాది సిటీలు ముందున్నాయి.  టాప్‌‌ ఏడు సిటీల నుంచి  2020–21 లో 4.02 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్‌‌ కొత్తగా క్రియేట్ అయ్యింది. ఇందులో హెదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీల వాటా 63 శాతంగా ఉంది.  వెస్ట్‌‌, నార్త్ సిటీలలో కంటే సౌత్ సిటీలలో ఆఫీస్‌‌ స్పేస్‌‌ మార్కెట్ బాగా పెరిగిందని అనరాక్‌‌ గ్రూప్‌‌ చైర్మన్‌‌ అనుజ్‌‌ పురి అన్నారు. దీనికి ప్రధాన కారణం ఐటీ, ఐటీ రిలేటెడ్ సెక్టార్‌‌‌‌కు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవ్వడమేనని చెప్పారు. రెంట్లు అఫోర్డబుల్‌‌గా ఉండడం, స్టార్టప్‌‌లు విస్తరిస్తుండడంతో ఆఫీస్ స్పేస్‌‌ మార్కెట్ సౌత్ సిటీలలో పెరుగుతోందని చెప్పారు.