- ఓపెన్లో ఇండియా–బి టీమ్కు కాంస్యం
- ఓపెన్, విమెన్స్లో కంబైన్డ్ గా గప్రిందాష్విలి ట్రోఫీ సొంతం
- 2 గోల్డ్ సహా ఏడు ఇండివిడ్యువల్ మెడల్స్ నెగ్గిన ఇండియన్స్
ఇండియా అథ్లెట్లు సూపర్ పెర్ఫామెన్స్తో కామన్వెల్త్ గేమ్స్ను ముగించిన తర్వాతి రోజే మన చెస్ గ్రాండ్ మాస్టర్స్ తమ ఎత్తులతో అదరగొట్టారు. చదరంగంలో అత్యుత్తమ టోర్నీ అయిన చెస్ ఒలింపియాడ్లో పతకాల మోత మోగించారు. ఇండియా తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా ఈవెంట్ విమెన్స్ సెక్షన్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారికతో కూడిన జట్టు బ్రాంజ్ మెడల్తో చరిత్ర సృష్టించింది. ఒలింపియాడ్లో విమెన్స్ జట్టుకు ఇదే తొలి పతకం. మరోవైపు ఓపెన్ సెక్షన్లో యంగ్ గ్రాండ్ మాస్టర్స్తో కూడిన ఇండియా–బి జట్టు కూడా బ్రాంజ్ గెలిచింది. ఓపెన్, విమెన్లో సంయుక్తంగా బెస్ట్ పెర్ఫామెన్స్కు గాను ఇండియా–ఎ ప్రతిష్టాత్మక గప్రిందాష్విలి ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే టైమ్లో ఇండివిడ్యువల్ మెడల్స్లో యంగ్స్టర్స్ రెండు గోల్డ్ సహా ఏడు పతకాలు కైవసం చేసుకొని శభాష్ అనిపించారు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ సిల్వర్తో మెరిశాడు.
మన అర్జున్కు సిల్వర్.. 2700 ఎలో రేటింగ్
ఒలింపియాడ్లో టీమ్స్తో పాటు ఆయా బోర్డుల్లో ప్లేయర్ల వ్యక్తిగత పెర్ఫామెన్స్ ఆధారంగా కూడా పతకాలు ఇచ్చారు. ఇందులో ఇండియన్స్ ఆధిపత్యం చూపెట్టారు. బోర్డు–ఎపై గుకేశ్ 11 గేమ్స్లో 9 పాయింట్లతో పాటు 2867 పెర్ఫామెన్స్ రేటింగ్తో గోల్డ్ గెలిచాడు. బోర్డు–బిలో నిహాల్ (7.5/11; 2774) కూడా గోల్డ్ రాబట్టాడు. బోర్డు–3లో తెలంగాణ యంగ్స్టర్, 18 ఏండ్ల అర్జున్ 11 గేమ్స్లో 8.5 పాయింట్లు, 2767 రేటింగ్తో సిల్వర్ సొంతం చేసుకున్నాడు. దాంతో పాటు చివరి గేమ్లో నెగ్గడం ద్వారా 2700 ఎలో రేటింగ్ పాయింట్లు దాటి ఈ ఘనత సాధించిన ఏడో ఇండియన్గా నిలిచాడు. ఇదే బోర్డులో ఆర్. ప్రజ్ఞానంద బ్రాంజ్ రాబట్టగా.. విమెన్స్లో తానియా, వైశాలి, దివ్య బ్రాంజ్ గెలిచారు. ఇక ఓపెన్, విమెన్ టీమ్ ఈవెంట్లలో సంయుక్తంగా ఎక్కువ పాయింట్లు (17+17) సాధించిన ఇండియా–ఎ ఫస్ట్ ప్లేస్తో నోనా గప్రిందాష్విలి ట్రోఫీని గెలిచింది.