పైగా ప్యాలెస్లోకి హెచ్ఎండీఏ ఆఫీస్... 6 నెలల్లో మైత్రీవనం నుంచి తరలింపు

పైగా ప్యాలెస్లోకి హెచ్ఎండీఏ ఆఫీస్... 6 నెలల్లో మైత్రీవనం నుంచి తరలింపు
  • ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆధీనంలోనే ప్యాలెస్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: మైత్రీ వనంలో కొనసాగుతున్న హెచ్ఎండీఏ ఆఫీసును ఆరు నెలల్లో పైగా ప్యాలెస్​లోకి తరలించనున్నారు. రసూల్​పురాలోని పైగా ప్యాలెస్​2006 వరకూ హుడా ఆఫీసుగా కొనసాగింది. తర్వాత యూఎస్​కాన్సులేట్​కు కేటాయించారు. హుడాను హెచ్ఎండీఏగా విస్తరించిన తర్వాత కొంతకాలం తార్నాకలోని హెచ్ఎండీఏ కాంప్లెక్స్​లో కొనసాగించారు. ఇక్కడ స్థలాభావం వల్ల అమీర్​పేటలోని మైత్రీవనానికి ఆనుకుని ఉన్న స్వర్ణజయంతి కాంప్లెక్స్​లోకి మార్చారు. ఇది కమర్షియల్​బిల్డింగ్​కావడంతో వేరే ఆఫీసులు కూడా ఉన్నాయి. అమీర్​పేట వంటి రద్దీ ప్రాంతంలో ఉండడంతో ఈ ఆఫీసుకు చేరుకోవాలనుకునే వారికి ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా మారింది. అధికారులు, సిబ్బంది కూడా టైంకు ఆఫీసుకు చేరుకోలేకపోతున్నారు. 

అలాగే, ప్రస్తుతం యూఎస్​కాన్సులేట్​ఆఫీసు గచ్చిబౌలికి తరలిపోవడంతో స్వర్ణజయంతి కాంప్లెక్స్​నుంచి పైగా ప్యాలెస్​కు హెడ్డాఫీసును షిఫ్ట్​ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పైగా ప్యాలెస్​ను యూఎస్​కాన్సులేట్​ఆఫీసుకు ఇచ్చిన తర్వాత మరింత ఆధునీకరించారు. దీంతో చిన్న చిన్న మార్పులతో ఇక్కడే కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉందంటున్నారు. 

కొన్ని విభాగాలు మాత్రమే తరలింపు  

ముందుగా, స్వర్ణజయంతి కాంప్లెక్స్​లోని హెచ్ఎండీఏలోని కొన్ని కీలక  విభాగాలను మాత్రమే ఈ భవనంలోకి షిఫ్ట్​చేయాలని అధికారులు నిర్ణయించారు. మెట్రోపాలిటన్​కమిషనర్, జాయింట్​కమిషనర్, ప్లానింగ్​విభాగాలు, ఇంజినీరింగ్​వంటి ముఖ్యమైన విభాగాలే పైగా ప్యాలెస్​లోకి తరలించే అవకాశం ఉంది. ఇతర విభాగాలు, కింది స్థాయి  స్టాఫ్​ స్వర్ణజయంతి కాంప్లెక్స్​లోని ఆఫీసులోనే కొనసాగించే అవకాశం ఉంది. రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి కార్యాలయ తరలింపు పూర్తవుతుందంటున్నారు.  

హెచ్ఎండీఏ రీఆర్గనైజ్..

హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్​ఆర్​వరకు విస్తరించడంతో కార్యకలాపాలు కూడా విస్తరించనున్నాయి. ప్రస్తుతం ఆరు జోన్లుగా ఉండగా 10 నుంచి 12 జోన్లకు విస్తరించేందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఇప్పుడున్న అధికారుల స్థానంలో అదనపు అధికారులను కూడా నియమించే అవకాశం ఉంది. అధికారుల నుంచి సిబ్బంది వరకూ వర్క్​మాన్యువల్​ను రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాలు కవరయ్యేలా జోనల్​ఆఫీసులను వేర్వేరుగా ఏర్పాటు చేయనున్నారు. ఆర్గనైజేషన్​ రూపు రేఖలు ఎలా ఉండాలన్న దానిపై త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమించి అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. 

జోనల్​ఆఫీసులు పెరిగితే హైరైజ్డ్​భవనాల నిర్మాణాల అనుమతులు, లేఔట్​ పర్మిషన్లు, రెగ్యులరైజేషన్​వంటివన్నీ జోనల్​ఆఫీసుల ద్వారానే ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 10,060 చ.కి.మీ. విస్తీర్ణంలో ఏర్పడిన హెచ్ఎండీఏ పరిధిలో నిర్మాణాల అనుమతులు, లేఔట్ల జారీలో ఇబ్బందులు రాకుండా ఉండాలన్నదే లక్ష్యమని, అందుకే ప్రతి పనికీ హెడ్డాఫీసుకు వచ్చే పని లేకుండా జోనల్​ ఆఫీసుల నుంచే అనుమతులు ఇచ్చే విషయంపై ఆలోచన చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.