హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీలో మహిళలకు హారిజంటల్(సమాంతర) రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ కోసం సెప్టెంబర్ 6న విడుదల చేసిన నోటిఫికేషన్లో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ల అమలు విధానం గురించి లేదని, దీనిపై తమ అభ్యర్థనను ఆఫీసర్లు పట్టించుకోలేదంటూ బి.శ్రీనివాసులు మరో 22 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. 33.33 శాతం రిజర్వేషన్ల అమలులో భాగంగా హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది.
ఈ మేరకు జస్టిస్ పి.మాధవీదేవి ఇటీవల మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు. టీచర్ పోస్టుల నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ మేరకు గ్రూప్ 1 పోస్టుల భర్తీ వ్యవహారంలో ఇదే హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పిందన్నారు. రాజేశ్ కుమార్ దారియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేశారు. నోటిఫికేషన్–ఎగ్జామ్స్ మధ్య 4 నెలల గడువు ఉండాలన్న రూల్ అమలు చేయడం లేదని కూడా పిటిషనర్ లాయర్ చెప్పారు.
డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు
డీఎస్సీ దరఖాస్తు గడువును రాష్ట్ర సర్కారు పొడిగించింది. ఈ నెల 28 వరకు అప్లికేషన్స్ స్వీకరించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు. 27 వరకూ ఆన్లైన్లో ఫీజు చెల్లించేందుకు గడువు పెంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో 5,089 టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇప్పటి దాకా 1.50 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు.=