న్యూఢిల్లీ: మనదేశంలోని ఏ టూరిస్ట్ ప్రాంతంలో చూసినా హోటళ్లు కళకళలాడుతున్నాయి. కశ్మీర్ లాంటి కొన్ని ప్రాంతాల్లోని హోటళ్లకు, రిసార్టులకు గత పదేళ్లలో ఎన్నడూ లేనంత డిమాండ్ కనిపిస్తోంది. ఉదాహరణకు గుల్మార్గ్లో ఉండే ఖైబర్ హిమాలయన్ రిసార్ట్ ఆక్యుపెన్సీ రేటు 91 శాతం వరకు ఉంది. ఈ వేసవిలో యావరేజ్ డెయిలీ రూమ్ రేటు రూ.40 వేల వరకు పలికింది. ఇక్కడి టూరిస్ట్ రోప్లైన్స్, కాటేజీ రూమ్స్ ఆక్యుపెన్సీ 95 శాతం ఉంది. రోప్వేను చూడటానికి ప్రతి నెలా 14 వేల మంది వరకు వస్తున్నారు. విమాన చార్జీలు కూడా విపరీతంగా పెరుగుతున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదని హోటల్ జీఎం వినీత్ చాబ్రా అన్నారు.
ఈ ప్రాంతంలోని హైవేలపై కార్లు ట్రాఫిక్జామ్లో ఇరుక్కుపోవడం సర్వసాధారణం. విదేశాలకు విమాన చార్జీలు అడ్డగోలుగా పెరగడం, వీసాల జారీ ఆలస్యం అవుతుండటంతో మనదేశంలోని టూరిస్ట్ లొకేషన్లకు రద్దీ ఎక్కువ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలు , అనేక ఇతర టూరిస్టు లొకేషన్లు అంతకుముందు క్వార్టర్తో పోలిస్తే ఈసారి మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాయి. ముస్సోరీ, కొడైకెనాల్, చిక్కమగళూరు వంటి వాటికి గత క్వార్టర్లో బుకింగ్లు దాదాపు ఐదు రెట్లు పెరిగాయని ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ క్లియర్ట్రిప్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ధరలు 15శాతం ఎక్కువగా ఉన్నా డిమాండ్ తగ్గలేదని పేర్కొంది. వేసవి డిమాండ్ కారణంగా హోటల్ పరిశ్రమకు బాగా లాభాలు వస్తున్నాయని క్లియర్ట్రిప్కు చెందిన మనూ శశి ధరణ్ అన్నారు.
పెరిగిన విమాన ప్రయాణాలు
తమకు దేశీయ హోటల్ బుకింగ్స్ 30–-35శాతం పెరిగాయని యాత్రా డాట్కామ్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్– జూన్ మధ్య దేశీయ విమాన ప్రయాణాల్లో 20–-25శాతం పెరుగుదల ఉందని పేర్కొంది. ఏప్రిల్–-జూన్ లో మనాలి, నైనిటాల్, ముస్సోరీ, కాశ్మీర్, లేహ్, లడఖ్ వంటి పాపులర్ హిల్ స్టేషన్లకు డిమాండ్ వార్షికంగా 50-–60శాతం మధ్య పెరిగింది. ఈ ప్రాంతాలకు విమాన ఛార్జీలు 40–-50శాతం ఎగిశాయి. విపరీతంగా పెరుగుతున్న హోటల్ రేట్లు రాబోయే సంవత్సరాల్లో డిమాండ్ను తగ్గించవచ్చని ఆపరేటర్లు అంటున్నారు. హోటల్, విమాన ఛార్జీల్లో విపరీతమైన పెరుగుదల ఉన్నా ఈ సంవత్సరం వేసవి ప్రయాణాలు తగ్గకపోవడం ఆసక్తికరమైన విషయమని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ బుకింగ్స్ ఈసారి 34శాతం తగ్గాయి. కరోనా వ్యాప్తి తర్వాత దేశీయ బుకింగ్లు 2019 స్థాయిల కంటే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి.