2040 నాటికి జాబిల్లిపై ఇండ్లు: నాసా సైంటిస్టులు

2040 నాటికి జాబిల్లిపై ఇండ్లు: నాసా సైంటిస్టులు

వాషింగ్టన్​(డీసీ): జాబిల్లిపైన జనావాసాల ఏర్పాటు దిశగా నాసా సైంటిస్టులు ప్రయత్నాలు ప్రారంభించారు. చంద్రుడిపైకి ఇప్పటికే వ్యోమగాములను పంపించిన నాసా.. త్వరలో అక్కడ త్రీడీ ఇండ్లను నిర్మించనుంది. అపోలో మిషన్ లలో భాగంగా నీల్ ఆర్మ్​స్ట్రాంగ్​ సహా పలువురు వ్యోమగాములను చందమామపైకి విజయవంతంగా పంపించింది. ఇప్పటి వరకు చంద్రుడిపై అడుగుపెట్టిన ఆస్ట్రోనాట్లు అక్కడ 75 గంటల పాటు గడిపారు.

 ఈ సమయాన్ని మరింత పెంచి, అక్కడ శాశ్వత నివాసాలు ఏర్పరుచుకునే ప్రయత్నంలో భాగంగా సరికొత్త ప్రాజెక్టును చేపడుతోంది. 2040 నాటికి జాబిల్లిపై పూర్తిస్థాయిలో నివాసాలను ఏర్పాటు చేయాలనే టార్గెట్​ తో పనిచేస్తున్నట్లు నాసా సైంటిస్టులు వెల్లడించారు. ఇందులో భాగంగా వారు ఓ ప్రత్యేకమైన త్రీడీ ప్రింటర్ ను తయారుచేశారు. చంద్రుడి ఉపరితలంపై లభించే మినరల్స్, అక్కడి రాళ్లను ఉపయోగించుకుని ఈ ప్రింటర్ కాంక్రీట్ ను తయారుచేస్తుందని చెప్పారు. 

ఆపై త్రీడీలో ఇంటిని తయారుచేస్తుందని వివరించారు. ప్రస్తుతం ఈ మిషన్ పై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.