
- 1842 శాంక్షన్ పోస్టులుంటే 496 మందే వర్కింగ్
- ఇందులో 350 మంది డిప్యూటేషన్ పై ఇతర శాఖల్లోకి
- ఇలాగైతే ఇందిరమ్మ స్కీమ్ అమలు కష్టమన్న ఆఫీసర్స్
- పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : హౌసింగ్ కార్పోరేషన్ను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. డిపార్ట్ మెంట్ కు 1,842 పోస్టులు శాంక్షన్ అయితే ప్రస్తుతం 496 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలోనూ 350 మందికి పైగా జలమండలి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కలెక్టరేట్లతో పాటు మొత్తం 30 శాఖల్లో డిప్యూటేషన్ పద్ధతిలోనే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు
అధికారులు 60 మంది మాత్రమే. గడిచిన నాలుగు నెలల్లోనే 50 మంది రిటైర్ అయ్యారు. ఉద్యోగుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కష్టమయ్యే చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. వెంటనే పోస్టుల భర్తీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
3 వేల కోట్లతో 95,235 ఇండ్లు
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ త్వరలో స్పీడప్ కానుంది. ఈ స్కీమ్ అమలు బాధ్యతలను ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా కార్పోరేషన్ కు అప్పగించింది. తొలి దశలో సొంత ఇంటి జాగా ఉన్న వారికి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నారు. తరువాత దశలో జాగాలు ఇవ్వనున్నారు.
స్కీమ్ అమలుకు హడ్కో నుంచి తొలి దశలో లోన్ కూడా సాంక్షన్ అయింది. రూ.3 వేల కోట్ల లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.3వేల కోట్లతో అర్బన్, రూరల్ లో కలిపి 95,235 ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది.
డిప్యూటేషన్లు రద్దు చేయాల్సిందే..
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వేగంగా అమలు కావాలంటే ఉద్యోగుల కొరత తీరాలని అధికారులు అంటున్నారు. అందుకు ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిప్యూటేషన్లు రద్దు చేసి మాతృ శాఖకు తీసుకురావాలని సూచించారు. స్కీమ్ సజావుగా సాగాలంటే పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఐటీడీఏ ఇంజినీరింగ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులను హౌసింగ్ కార్పోరేషన్కు డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకరావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
డిపార్ట్మెంట్ సపరేట్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ ను ఆర్ అండ్ బీలో కలిపివేసింది. దీంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సపరేట్గా ఉంచాలని కోరినా మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని గుర్తుచేస్తున్నారు. “ హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నం. గత ప్రభుత్వం హౌసింగ్ శాఖను రద్దు చేసి ఆర్ అండ్ బీలో విలీనం చేసింది. దాంతో 500 మంది ఉద్యోగులను ఇతర 31 ప్రభుత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోకి డిప్యుటేషన్ మీద పంపారు.
దీని వల్ల అనేక మంది ఉద్యోగులు మానసికంగా ఆందోళనకు గురిఅయ్యాం. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. కానీ, సిబ్బంది లేరు. ఉద్యోగుల కొరత తీరాలంటే డిప్యూటేషన్లు రద్దు చేసి, ఇతర శాఖల నుంచి ఇంజినీర్లను తీసుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని హౌసింగ్ ఇంజినీర్స్, వర్క్ ఇన్స్ పెక్టర్స్ అసోసియేషన్ నేతలు కోరారు.
ఉమ్మడి రాష్ర్టంలో ఫుల్ స్టాఫ్
ఉమ్మడి రాష్ర్టంలో 2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి సక్సెస్ అయింది. అప్పట్లో ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ( ఏఈఈ) , ప్రతి నియోజకవర్గానికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) , రెవెన్యూ డివిజన్ కు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈ ), జిల్లాకు సూపరింటెండెంట్ ఇంజినీర్ ( ఎస్ఈ)లు ఉన్నారు.
పోస్టులు శాంక్షన్ అయిన పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న వారు
డీఈఈ 126 16
ఏఈలు 505 183
డ్రాఫ్ట్ మెన్ 50 0
టెక్నికల్ వర్క్ ఇన్స్ పెక్టర్ 505 70
నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్ పెక్టర్ 211 31
సీనియర్ అసిస్టెంట్ 85 12
అసిస్టెంట్ మేనేజర్ 58 16