
ప్రపంచమంతా వ్యర్థాలతో నిండిపోతోంది. ఆ వేస్ట్ ప్రకృతితో పాటు ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ప్లాస్టిక్తోపాటు రకరకాల వ్యర్థాలు భూమ్మీద పేరుకుపోతున్నాయి. అలాంటివాటిలో సిరామిక్ కూడా ఒకటి.ఇది కూడా కొన్ని శతాబ్దాల పాటు భూమిలో కలిసిపోదు. సిరామిక్ ప్రొడక్ట్స్ వాడకం పెరుగుతున్నకొద్దీ వాటి వ్యర్థాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదంతా చూసిన శశాంక్ నిమ్కార్ సిరామిక్ వేస్ట్ నుంచి కొత్త వస్తువులను తయారుచేసే పనిలో పడ్డాడు.అందుకోసం అతనేం చేశాడంటే..
శశాంక్ నిమ్కార్ తన స్టార్టప్ ‘ఎర్త్ తత్వ’ద్వారా సిరామిక్ వ్యర్థాలను కళాకారులు, ఆర్కిటెక్ట్లు, డిజైనర్లు ఉపయోగించలిగే ఒక వెర్సటైల్ మెటీరియల్గా మారుస్తున్నాడు. సిరామిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలనే ఆలోచన శశాంక్కి రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దానివల్ల పర్యావరణానికి కలుగుతున్న సమస్యలే అతనిలో స్టార్టప్ పెట్టాలనే పట్టుదలని పెంచాయి. శశాంక్ పుణెలోని సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి యానిమేషన్ ఫిల్మ్ డిజైన్లో డిగ్రీ చేశాడు. ఆ తర్వాత అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు ఫ్రీలాన్సర్గా పనిచేశాడు. కొన్నాళ్లకు మళ్లీ చదువుకోవాలనే ఉద్దేశంతో అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో చేరి ఇండస్ట్రియల్ డిజైన్లో మాస్టర్స్ చేశాడు. అక్కడే అతను సిరామిక్, గ్లాస్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. కోర్సులో భాగంగానే 2017లో ఉత్తరప్రదేశ్లోని ఖుర్జా సిరామిక్ మాన్యుఫాక్షరింగ్ హబ్కి వెళ్లాడు. అక్కడే అతనికి ఎంట్రపెన్యూర్గా మారాలనే ఆలోచన వచ్చింది. ‘‘వీధుల్లో తిరుగుతూ ఫ్యాక్టరీలను చూస్తున్నప్పుడు ప్రతిచోటా సిరామిక్ వేస్ట్ని పారేస్తుండడం గమనించా. అప్పుడే అక్కడి పారిశ్రామికవేత్తలతో ఆ వేస్ట్ గురించి మాట్లాడా. వాళ్లకు సిరామిక్స్ ఎప్పటికీ బయోడీగ్రేడబుల్ కాదని తెలిసినా ఇష్టానుసారంగా వేస్ట్ని పారేస్తున్నారు. అప్పుడే నాకు మనం డిజైనర్లుగా ఇక్కడ ఎందుకు ఉన్నాం? ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకే కదా? అనిపించింది. ప్రతి కొత్త సీజన్.. కొత్త రంగులు, కొత్త ఆకారాలు, కొత్త కలెక్షన్స్తో నిండిపోతుంది. కానీ.. పాత సిరామిక్ వేస్ట్ మాత్రం అలానే మిగిలిపోతోంది” అన్నాడు శశాంక్.
ఎంతో రీసెర్చ్ చేసి..
ఈ వేస్ట్ సమస్యను పరిష్కరించే అవకాశం శశాంక్కు ఎన్ఐడీ ద్వారా దొరికింది. శశాంక్కి కావాల్సిన రీసోర్సెస్, మెంటర్షిప్ యాక్సెస్, ప్రయోగాలు చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అక్కడ దొరికాయి. ఇతర దేశాల్లో సిరామిక్ వ్యర్థాలతో ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నతో శశాంక్ పరిశోధన మొదలైంది. అప్పుడతనికి సిరామిక్ వేస్ట్ని రీసైకిల్ చేయడానికి యూనివర్సల్ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. ఎవరికి అనువుగా అనిపించే పద్ధతిలో వాళ్లు రీసైకిల్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. 1990ల చివరలో జపాన్లో సక్సెస్ అయిన ఒక ప్రాజెక్ట్ ఇన్సిపిరేషన్తో వేస్ట్ని ఉపయోగపడేలా మార్చడంపై ప్రయోగాలు ప్రారంభించాడు. శశాంక్ ఈ జర్నీలో కొన్ని సాంకేతిక అడ్డంకులను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ‘‘రీ సైకిల్ ప్రక్రియ కోసం సరైన బైండర్ను కనుక్కోవడం చాలా ముఖ్యం. రీసైకిల్లో చాలావరకు సిమెంట్, రెసిన్ను వాడతారు. వాటిని వాడడం వల్ల సిరామిక్ ఎక్కువ కాలం మన్నికగా ఉండదు. పైగా ఒకసారి వాటిని సిరామిక్లో కలిపితే మళ్లీ వేరు చేయలేం. అందుకే నేను మన్నికైన ప్రొడక్ట్ని తయారుచేయడానికి వాటికి బదులుగా నేచురల్ బైండర్ అయిన బంకమట్టిని వాడాలి అనుకున్నా. రీసైకిల్ చేసిన సిరామిక్ వ్యర్థాల్లో బంకమట్టి బైండర్ కలపడానికి ఒక ఉత్తమ మార్గాన్ని కనుగొన్నా అదే ‘స్లిప్ కాస్టింగ్’. ఈ పద్ధతిలో రీసైకిల్ చేసిన సిరామిక్, బంకమట్టిని ద్రవరూపంలోకి మార్చి.. రెండింటినీ కలిపి మళ్లీ ఘన రూపంలోకి తీసుకొస్తాం. చాలా ప్రయోగాలు చేసిన తర్వాత మా కాస్టింగ్ మిక్స్లో 70 శాతం వరకు రీసైకిల్ చేసిన సిరామిక్ను ఉపయోగించవచ్చని తెలుసుకున్నా” అంటూ తన రీసెర్చ్ ప్రయాణాన్ని చెప్పుకొచ్చాడు శశాంక్.
ఇది చాలా స్ట్రాంగ్
తత్వామిక్స్తో తయారుచేసిన వస్తువులు సాధారణ సిరామిక్లతో పోలిస్తే 35 శాతం ఎక్కువ ధృడంగా ఉంటాయి. ఇది 100 శాతం రీసైకిల్ చేయదగినది. అంతేకాదు.. ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కాబట్టి ఎలాగైనా వాడుకోవచ్చు. పైగా సంప్రదాయ సిరామిక్లతో సమానంగా వీటితో ఎలాంటి డిజైన్లో అయినా వస్తువులను తయారుచేసుకోవచ్చు. ఎర్త్ తత్వ ప్రస్తుతం టేబుల్వేర్, హోమ్ డెకర్, ప్లాంటర్స్, ఫర్నిచర్, టైల్స్, శానిటరీవేర్ లాంటివి ఉత్పత్తి చేస్తోంది. కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించాలనే ఆలోచనతో ఉన్నవాళ్లు, కొన్ని లగ్జరీ హోటళ్లు, ఆర్గానిక్ కేఫ్ల్లో వీటిని వాడుతున్నారు.
మెషిన్ల వాడకం తక్కువే!
స్టార్టప్లో వస్తువులు తయారుచేసే క్రమంలో మెషిన్లను చాలా తక్కువగా వాడతారు. ప్రతి వస్తువుని చేతితోనే తయారుచేస్తారు. ప్రతి వస్తువు తయారీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీనివల్ల ప్రొడక్షన్ తక్కువగా ఉన్నా క్వాలిటీ బాగుంటుంది. పైగా ఈ స్టార్టప్ ద్వారా సిరామిక్ వేస్ట్లోని 60 శాతం రీసైక్లింగ్ చేయడం ద్వారా ముడి పదార్థాల వెలికితీత అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారు. రీసైక్లింగ్ చేయడానికి కంపెనీ ఇప్పటివరకు దాదాపు ఎనిమిది టన్నుల వేస్ట్ని సేకరించింది. దీని వల్ల 450–500 కిలోల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్టు అయ్యింది. ప్రస్తుతం ఎర్త్ తత్వ మిక్స్ని ఆర్టిస్ట్లు, ఆర్కిటెక్ట్స్ కళాత్మక వస్తువులను తయారుచేయడానికి వాడుతున్నారు.
తొలి అడుగులు
అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇక స్టార్టప్ పెట్టాలనుకునే టైంకి ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. ఫండ్స్ సేకరించడం కష్టమైంది. దాంతో స్టార్టప్ పనులను కొన్నాళ్లపాటు పక్కనపెట్టాడు. ఆ తర్వాత గుజరాత్ ప్రభుత్వ గ్రాంట్ కోసం అప్లై చేశాడు. 2020 చివరి నాటికి శశాంక్కు రూ. 20 లక్షల గ్రాంట్ ఇచ్చారు. దాంతో 2021లో స్టార్టప్కు పునాదులు వేశాడు. అయితే.. సిరామిక్ వ్యర్థాలను పనికొచ్చే వస్తువులుగా మార్చే ప్రాసెస్ చాలా క్లిష్టమైనది. అతను గుజరాత్లోని మోర్బి, తంగడ్లోని ఫ్యాక్టరీల నుంచి ఇండస్ట్రియల్ సిరామిక్ వేస్ట్ని సేకరిస్తున్నాడు. ఆ వేస్ట్ని సన్నని పొడిగా మారుస్తారు. ఆ తర్వాత బంకమట్టి బైండర్ కలిపి.. మిల్లులో వేసి ప్రాసెస్ చేస్తారు. రకరకాల ప్రాసెసింగ్ ప్రక్రియల తర్వాత అది గుండ్రని బాల్లా మారుతుంది. ఈ రీసైకిల్డ్ సిరామిక్ మెటీరియల్కు ‘తత్వా మిక్స్’ అని పేరు పెట్టి, పేటెంట్ కూడా తీసుకున్నాడు. దాంతో ఆర్టిస్ట్లు, అన్నం తినే ప్లేట్ల నుంచి టైల్స్ వరకు రకరకాల ప్రొడక్ట్స్ని తయారుచేస్తున్నారు.
►ALSO READ | Summer tour: గ్యాడ్జెట్స్..పోర్టబుల్ ఫ్యాన్.. ప్రయాణంలో ఉక్కపోత నుంచి రిలీఫ్