అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో చంద్రయాన్ - 3 విజయం వెనుక మసలా దోశ, ఫిల్టర్ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇది వినడానికి విచిత్రంగా, నమ్మశక్యంగా లేకపోయినా చంద్రయాన్ - 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ ప్రముఖ పాత్ర పోషించిందన్న విషయం మాత్రం వాస్తవం. ఇక ఈ అంశంపై ఇస్రో సైంటిస్ట్ల నుంచి సేకరించిన సమాచారంతో వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
చంద్రయాన్ -3 సక్సెస్లో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్రపైచంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ వివరించారు. అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు ఓపిక, శక్తి కావాలి. అందుకే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మసాలా దోస, ఫిల్టర్ కాఫీని సిబ్బందికి అందించామన్నారు. దీంతో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో పనిచేసిన వారు ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పనిచేశారని తెలిపారు.
ఏది ఏమైనప్పటికీ, భారత్ చంద్రయాన్ -3పై చేసిన ఖర్చు, సాధించిన విజయాలు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే. ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అందరి మన్ననలు అందుకుంది. చంద్రయాన్-3 మిషన్ను కేవలం రూ. 615 కోట్ల రూపాయలతోనే ఇస్రో చేపట్టింది. అంతరిక్ష రంగంలో అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 విజయంపై ఈ ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా..ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఈ ప్రయోగం విజయ వంతం కావడం పట్ల ప్రపంచ దేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి.