
- పల్లి రైతులతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ శివారులో బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వేరుశనగ పొలంలో పనులు చేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలను పలకరించారు. వేరుశనగ దిగుబడి ఎంత వస్తుంది ? మద్దతు ధర ఎలా ఉంది ? కూలీ రేట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొల్లాపూర్ పట్టణంలోని తమ కాలనీల్లో నల్లా నీరు సక్రమంగా రావడం లేదని, కొన్ని రోజులుగా అపరిశుభ్రమైన నీరు వస్తుందని మంత్రికి వివరించారు.
స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత ఆఫీసర్లకు ఫోన్ చేసి నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వాటర్ ట్యాంక్లను క్లీన్ చేయాలని ఆదేశించారు. అనంతరం ఓ గీత కార్మికుడిని పలకరించారు. సహజ సిద్ధమైన కల్లునే విక్రయించాలని, కల్తీ కల్లు జోలికి పోవొద్దని సూచించారు. తర్వాత కొల్లాపూర్ బార్ కౌన్సిల్ మీటింగ్కు హాజరయ్యారు. మంత్రిని బార్ కౌన్సిల్ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఆయన వెంట భాస్కర్రెడ్డి, శివారెడ్డి, కురుమయ్య, నాయకులు నాగరాజు, రామదాసు ఉన్నారు.
పీజీ కాలేజీలో మెస్ ప్రారంభించాలి
పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ కొల్లాపూర్ హాస్టల్లో మెస్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. హాస్టల్లో భోజన వసతి లేకపోవడంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే మెస్ ప్రారంభించాలని కోరారు.