సెక్రటేరియట్ కూల్చేయడానికి ఎంత టైం పడ్తది

సెక్రటేరియట్ కూల్చేయడానికి ఎంత టైం పడ్తది

సెక్రటేరియట్‌లోని ఆఫీసుల తరలింపు, ప్రస్తుత బిల్డింగులను కూల్చివేయడానికి ఎంతటైం పడుతుందని సీఎం కేసీఆర్​అధికారులను ప్రశ్నించారు. శనివారం ప్రగతి భవన్‌లో కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం, మునిసిపల్‌ చట్టంపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే భూమి పూజచేసినందున వీలైనంత త్వరగా షిఫ్టింగ్‌ పూర్తిచేసి, బిల్డింగులను కూల్చేస్తే నిర్మాణ పనులు మొదలెట్టవచ్చన్నారు. సెక్రటేరియట్‌లోని అన్ని బ్లాక్‌లనూ కూల్చివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆర్‌అండ్‌ బీ మంత్రి నేతృత్వంలో కమిటీని నియమించిన సీఎం ఆ కమిటీ రిపోర్టుతో సంబంధంలేకుండానే కూల్చివేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వచ్చే యేడాది దసరా నాటికి కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభించుకునేలా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయాలని, అందుకే మునిసిపల్‌ చట్టాన్ని మారుస్తున్నామని చెప్పారు. చట్టాల్లో మార్పులు తెచ్చినప్పుడే గుణాత్మక పాలన అందించగలమన్నారు. సమీక్షలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్‌ జోషి, రాజీవ్‌శర్మ, నర్సింగరావు, స్మితా సబర్వాల్‌, రాజశేఖర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, అధర్‌సిన్హా, సునీల్‌శర్మ, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.