- 98 శాతం వరకు పెరిగిన మరో 19 కంపెనీల షేర్లు
- భవిష్యత్ బాగుంటుందనే అంచనాలతోనే పైకి!
బిజినెస్ డెస్క్, వెలుగు: ఒక కంపెనీ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందనేది వాటికి వచ్చే లాభాలను బట్టి తెలుస్తుంది. ఎక్కువ లాభాలు వస్తే కంపెనీ దగ్గర క్యాష్ రిజర్వ్లు బాగున్నాయని, ఇన్వెస్టర్లకు డివిడెండ్లు బాగా చెల్లించగలదని అంచనా వేస్తాం. అలానే కంపెనీ తన బిజినెస్ను మరింత విస్తరించగలుగుతుందని భావిస్తాం. ఈ అంశాల ఆధారంగానే కంపెనీల షేర్ల పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ, దలాల్ స్ట్రీట్లోని 20 కంపెనీల షేర్లు మాత్రం ఇందుకు విరుద్ధంగా పెరుగుతున్నాయి. అంటే గత నాలుగు క్వార్టర్లలో ఈ కంపెనీలకు నష్టాలే వస్తున్నప్పటికీ, వీటి షేర్లు మాత్రం మార్కెట్లో 3,780 శాతం వరకు పెరిగాయి. ఈ 20 షేర్లు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీస్లు, మెటల్స్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ సెక్టార్ల నుంచి ఉన్నాయని డేటా ఎనాలసిస్ కంపెనీ ఏస్ ఈక్విటీ పేర్కొంది.
ఈ లిస్టులో ఇవే టాప్..
1 : గత నాలుగు క్వార్టర్ల నుంచి నష్టాలే ప్రకటిస్తున్న టెక్స్టైల్ కంపెనీ ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఈ లిస్టులో టాప్లో ఉంటుంది. కంపెనీ షేరు గత ఏడాది కాలంలో 3,780 శాతం పెరిగింది. ఈ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.1,800 కోట్లుగా ఉంది. ఎస్ఈఎల్కు గత నాలుగు క్వార్టర్లలో రూ.24 కోట్లు నుంచి రూ.56 కోట్ల మధ్య నష్టాలు వచ్చాయి. ఈ కంపెనీ షేరు శుక్రవారం రూ.541 వద్ద క్లోజయ్యింది.
2 : గత నాలుగు క్వార్టర్లలో రూ.58 కోట్ల వరకు నష్టాన్ని ప్రకటించిన స్వాన్ ఎనర్జీ షేరు డూకుడు మీద ఉంది. కంపెనీ షేర్లు గత ఏడాదిలో 98 % , గత నెల రోజుల్లో 11 % లాభపడ్డాయి.
3 : అతుల్ ఆటోకి గత నాలుగు క్వార్టర్లలో రూ. 9 కోట్ల వరకు నష్టం రాగా, కంపెనీ షేర్లు మాత్రం గత ఏడాది కాలంలో 54 శాతం పెరిగాయి. గత నాలుగు క్వార్టర్లలో రూ.11 నుంచి 15 కోట్ల వరకు నష్టాలను ప్రకటించిన షాలిమర్ పెయింట్స్ షేర్లు గత ఏడాది కాలంలో 45 % పెరిగాయి. రూ.6 కోట్ల వరకు నష్టాలు ప్రకటించిన రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ షేర్లు 41 %ఎగిశాయి.
4 : డీఎఫ్ఎం ఫుడ్స్ షేర్లు గత ఏడాది కాలంలో 33 % లాభపడగా, ఈ కంపెనీకి గత నాలుగు క్వార్టర్లలో రూ. 5–15 కోట్ల వరకు నష్టాలొచ్చాయి. 63 మూన్స్, హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ కంపెనీలు కూడా గత నాలుగు క్వార్టర్లలో రూ. రూ.7– 22 కోట్ల వరకు నష్టాలను ప్రకటించగా, వీటి షేర్లు ఇదే టైమ్లో 25 % వరకు పెరిగాయి.
5 : జై ప్రకాశ్ అసోసియేట్స్కు గత నాలుగు క్వార్టర్లలో రూ. 348 కోట్ల నుంచి రూ.546 కోట్ల మధ్యలో నష్టాల్లొచ్చాయి. షేర్లు మాత్రం గత ఆరు నెలల్లో 18 % పెరిగాయి. అదేవిధంగా అనుపమ్ ప్రాప్టెక్, రాటన్ఇండియా పవర్, హెచ్ఎంటీ, థామస్ కుక్, ఓమెక్స్, ఆర్కిడ్ ఫార్మా షేర్లు ఈ ఏడాది 15% వరకు లాభపడ్డాయి.
ఎందుకు పెరుగుతున్నాయంటే?
సాధారణంగా ఫ్యూచర్లో కంపెనీల పనితీరు మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రస్తుతం చిన్న పాటి సమస్యలున్నప్పటికీ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తుంటారు. అంటే కంపెనీల షేర్లు ఎప్పుడూ కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుందనే అంశంపై ఆధారపడి కదులుతాయి. వరుస క్వార్టర్లలో నష్టాలొస్తున్నప్పటికీ వీటి ఫండ్మెంటల్స్ బాగుండడం, ఇంకేదైనా కంపెనీ వీటిని టేకోవర్ చేయడానికి ఆసక్తి చూపడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. కంపెనీల ఫ్యూచర్ మెరుగ్గా కనిపిస్తే, షార్ట్ టర్మ్లో వచ్చే చిన్న పాటి ఇబ్బందులను ఇన్వెస్టర్లు పట్టించుకోరని ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఎండీ జీ చొక్కలింగమ్ అన్నారు. నష్టాల నుంచి తిరిగి లాభాల్లోకి రాగలిగే కంపెనీలు లేదా మరో కంపెనీ కొనుగోలు చేయాలనుకునేవి లేదా ఈ రెండు కేటగిరీల్లోకి వచ్చే కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయని వివరించారు. ఇలాంటి కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను ఆకర్షించొచ్చని చెప్పారు. అండర్లైంగ్లో కంపెనీకి అవకాశాలు ఉంటే, వీటి షేర్లు సమీప కాలంలో పెరుగుతాయన్నారు.