
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి పార్టీలు. అప్పుడే ఓటర్లను మచ్చిక చేసే పనిలో పడ్డాయి. నగదు, బహుమతులు పంచుతున్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు. ఈ విషయంలో అధికార పార్టీ స్పీడ్ పెంచింది. లేటెస్ట్ గా వరంగల్ జిల్లాలో ఓ బీఆర్ఎస్ సర్పంచ్ ఇంట్లో ఓటర్లకు పంచేందుకు రెడీగా ఉన్న చీరలు, టిఫిన్ బాక్సులు, బ్యాగులను భారీగా పట్టుకుంది ఎలక్షన్ స్పెషల్ ఫ్లయింగ్ స్కాడ్.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో ఎన్నికల స్పెషల్ ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీలు చేసింది. ఓటర్లకు పంచేందుకు డంప్ చేసిన వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులు, బ్యాగ్స్ ను గుర్తించారు అధికారులు. సోమారం గ్రామ బీఆర్ఎస్ సర్పంచి రాపాక రేణుక - నాగయ్య ఇంట్లో ఈ వస్తువులను పట్టుకున్నారు. వర్దన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఫొటో, లోగోలతో ఉన్న బ్యాగులను, బాటిల్స్ ను గుర్తించారు అధికారులు. పక్కా సమాచారంతో ఎన్నికల స్పెషల్ ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన అధికారులు వీటిని పర్వతగిరి పోలీసులకు అప్పగించారు.
Also Read : దేవభూమిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలివే.. లిస్టవుట్ చేసిన మోదీ
ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. పోలీసుల తనిఖీల్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బుల కట్టలు దొరుకుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 13న బెంగళూరులోని ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో తెలంగాణకు తరలిస్తున్న 42 కోట్ల నగదను పట్టుకున్న సంగతి తెలిసిందే..