
- ప్రైమ్ డే, రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం సేల్స్లో అమ్మేందుకు ప్లాన్
- కిందటేడాది దీపావళి తర్వాత తగ్గిన ఫోన్ల విక్రయాలు
- ఈ ఏడాది కొత్త మోడళ్లను లాంచ్ చేయడంతోనూ పెరిగిన స్టాక్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రైమ్ డే, రక్షాబంధన్, ఇండిపెండెంట్ డే సేల్స్ సీజన్ మొదలు కావడంతో కంపెనీలు ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. తమ దగ్గర ఉన్న స్టాక్ను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వచ్చే కీలక దీపావళి సీజన్కు ముందు తమ దగ్గర ఎక్కువగా ఉన్న స్టాక్ను క్లియర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.
ఎనాలసిస్ కంపెనీ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇన్వెంటరీ స్థాయిలు గత ఏడాది కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కిందటేడాది దీపావళి తర్వాత అమ్మకాలు గణనీయంగా తగ్గడం, ఈ ఏడాది కొత్త మోడళ్లను కంపెనీలు లాంచ్ చేయడంతో వీరి దగ్గర స్టాక్ పెరిగిపోయింది. “కిందటేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇన్వెంటరీ ఎక్కువగా ఉంది. గతేడాది దీపావళి సీజన్ ముగిసిన తర్వాత విక్రయాలు బాగా పడిపోయాయి.
స్మార్ట్ఫోన్ బ్రాండ్లు 2025 కోసం కొత్త మోడళ్లను తీసుకొచ్చాయి” అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో స్టాక్ క్లియర్ చేయడంపై బ్రాండ్లు దృష్టి పెట్టాయని, రిటైల్ విక్రయాలు 3శాతం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. కంపెనీలు సప్లయ్ తగ్గించినప్పటికీ, ఇన్వెంటరీ ఇంకా ఎక్కువగానే ఉంది. దీంతో బ్రాండ్లు దీపావళి సీజన్ ముందు స్టాక్ క్లియర్ చేయడానికి ప్రైమ్ డే వంటి సేల్స్ ఈవెంట్లలో భారీ డిస్కౌంట్లు, ప్రమోషన్లు ఇస్తున్నాయి.
“ఏప్రిల్–జూన్ క్వార్టర్ ప్రారంభంలో ఇన్వెంటరీ 11 వారాలుగా ఉండగా, వర్షాకాల అమ్మకాల తర్వాత 10 వారాలకు దిగొచ్చింది. కానీ బ్రాండ్లు మళ్లీ స్టాక్ నింపడంతో ఇది మళ్లీ పెరుగుతోంది. డిమాండ్ కూడా నెమ్మదిగా తిరిగొస్తోంది. కానీ ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో క్లారిటీ లేదు” అని పాఠక్ చెప్పారు.
షియోమి, రియల్మీ, ఒప్పో వద్ద ఎక్కువ స్టాక్
కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం, వివో, శామ్సంగ్, యాపిల్, మోటరోలా వద్ద ఇన్వెంటరీ తక్కువగా ఉంది. అయితే వన్ప్లస్, షియోమి, ఐకూ, రియల్మీ, ఒప్పో, నథింగ్ వద్ద స్టాక్ ఎక్కువగా ఉంది. ఎక్కువ స్టాక్ ఉన్న బ్రాండ్లు ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తాయని పాఠక్ అన్నారు. దీపావళి సీజన్ ముందు స్టాక్ క్లియర్ చేయడానికి స్మార్ట్ఫోన్, కన్స్యూమర్ టెక్ కంపెనీలు అమెజాన్ ప్రైమ్ డే వంటి సేల్స్ ఈవెంట్లలో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి.
ఉదాహరణకు, శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీ దాని ఇప్పటివరకు అతి తక్కువ ధరైన రూ.74,999కి ప్రైమ్ డే ఈవెంట్లో అందుబాటులోకి రానుంది. 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ను కూడా ఇవ్వనుంది. ఇది ప్రీమియం ఫోన్లలో ఆకర్షణీయ డీల్గా నిలిచింది. యాపిల్ ఐఫోన్ 15 ధర ప్రైమ్ డే సేల్లో రూ.57,999 గా ఉంది. కాగా, అమెజాన్ ప్రైమ్డే సేల్స్ ఈ నెల 12 నుంచి 14 వరకు జరుగుతాయి.
మిడ్-రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్లలో కూడా ఆకర్షణీయ ధరలు ఉన్నాయి. ఐకూ నియో 10ఆర్ 5జీ ధర రూ.23,499కి దొరకనుంది. రూ.2 వేల బ్యాంక్ డిస్కౌంట్, రూ.500 కూపన్, 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను ఇస్తోంది. అలాగే, వన్ప్లస్ 13ఎస్ రూ.49,999కి (రూ.5 వేల బ్యాంక్ ఆఫర్, 12 నెలల ఈఎంఐ) అందుబాటులో ఉంది. వన్ప్లస్ 13, 13ఆర్, నార్డ్ సీఈ4 లైట్ కూడా డిస్కౌంట్లు, ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి.