శ్రీశైలంలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీశైలంలోని లలితాంబ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ మంటలు చెలరేగాయి. ఓ దుకాణంలో చెలరేగిన మంటలు పక్కన ఉన్న దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. దుకాణదారులు విద్యుత్ శాఖకు ఫోన్ చేసి పవర్ కట్ చేయించారు. ఈ ఘటనలో 14 షాప్ లు..రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న ఈవో లవన్న దేవస్థానం అధికారులు, పోలీసులు పరిశీలించారు. దాదాపు రూ కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రమాదాన్ని నివారించేందుకు ముందస్తుగా ఎటువంటి ఫైర్ సేఫ్టీ నియమాలను పాటించలేదని దేవస్థాన అధికారులపై ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.