ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్ట్ తగ్గించాలన్న కేటీఆర్
కేంద్రం, రాష్ట్రాలు సహకరించుకోవాలి
ఫలితంగా మరిన్ని ఇన్వెస్టుమెంట్లు వస్తయ్
పీఏఎఫ్ఐ సమావేశాల్లో మంత్రులు
హైదరాబాద్, వెలుగు: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటే మరింత డెవెలప్మెంట్ సాధ్యపడుతుందని తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల ఇండస్ట్రీల మినిస్టర్లు స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య కూడా సహకారం తప్పనిసరి అన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లలోనూ మనదేశం సత్తా చాటాలంటే ఒకరికొకరం సాయపడాలని పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ( పీఏఎఫ్ఐ) ఏడో నేషనల్ ఫోరం సమావేశంలో స్పష్టం చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ మీటింగ్లో తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత క్రైసిస్ను అవకాశంగా మల్చుకొని మరింత డెవలప్మెంట్ సాధించాలన్నారు. విధానాలను తయారు చేసేది కేంద్ర ప్రభుత్వమే అయినా, అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు. రాష్ట్రాల్లో ఎకనమిక్, ఇండస్ట్రీల యాక్టివిటీలు పెరగడానికి కేంద్రం సహకరించాలని చెప్పారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్ట్ మరింత తగ్గేలా చేయాలి. ఇందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాలు నేరుగా ఇంటర్నేషనల్ మార్కెట్లో పోటీపడవు. కేంద్రమే ఆ పనిచేయాలి. మా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణ భారీగా ఇన్వెస్ట్మెంట్లను రాబడుతోంది. తెలంగాణకు వచ్చిన 28 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లలో ఇది వరకే పెట్టుబడి పెట్టిన వారి డబ్బే 23 శాతం ఉంది. కంపెనీలను ఎంకరేజ్ చేయడం వరకే మేం ఆగిపోం. చెయ్యి పట్టి నడిపిస్తాం. వారి ఆపరేషన్స్కు సాయపడతాం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. యూపీ ఇండస్ట్రీల మంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ మాట్లాడుతూ తాము 5–పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. మెరుగైన ఇండస్ట్రీ విధానంతోపాటు విద్య, ఆరోగ్యం, శాంతిభద్రతలు, ఇన్ఫ్రాపై ఫోకస్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాలు కూడా పరస్పరం సహకరించుకుంటే మనదేశానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారు. గుజరాత్ ఇంధనశాఖ మంత్రి సౌరభ్భాయ్ పటేల్ మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి తమ రాష్ట్రం రెండంకెల గ్రోత్ను సాధిస్తోందని చెప్పారు. అన్ని రకాల కంపెనీలు గుజరాత్లో ఇన్వెస్ట్మెంట్కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయని అన్నారు. మహారాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ సుభాశ్ దేశాయ్ మాట్లాడుతూ ఇండస్ట్రీలను ఆకర్షించడంలో తాము నంబర్వన్ ప్లేస్లో ఉన్నామని, జీడీపీలో తమ రాష్ట్రా వాటాయే 15 శాతమని అన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ సెక్రెటరీ జనరల్ దిలీప్ షెనాయ్ కూడా పాల్గొన్నారు.