క్యూ1లో రూ.2,866 కోట్ల నికర నష్టాలు
పెరిగిన ఏఆర్పీయూ
40.37 కోట్ల మంది కస్టమర్లు
న్యూఢిల్లీ : గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తొలిసారి భారతీ ఎయిర్టెల్ భారీ నష్టాలను పోస్ట్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి క్వార్టర్లో భారతీ ఎయిర్టెల్ నికర నష్టాలు కన్సాలిడేటెడ్గా రూ.2,866 కోట్లు ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో భారతీ ఎయిర్టెల్కు రూ.97 కోట్ల లాభం వచ్చింది. ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి పోటీ విపరీతంగా ఉండటంతో అసాధారణమైన వ్యయం రూ.1,400 కోట్లు అయినట్టు తెలిపింది. ఎయిర్టెల్కు ఆపరేషన్స్ నుంచి వచ్చిన కన్సాలిడేటెడ్ రెవెన్యూలు వార్షికంగా 4.7 శాతం పెరిగి రూ.20,738 కోట్లుగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ రెవెన్యూలు రూ.19,799 కోట్లుగా ఉండేవి. ఇండియాలోని వైర్లైస్ బిజినెస్ల నుంచి వచ్చిన రెవెన్యూలు వార్షికంగా 4.1 శాతం పెరిగి రూ.10,724 కోట్లకు చేరుకున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది.
జూన్ క్వార్టర్లో రిలయన్స్ జియో రూ. 11,679 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూను ఆర్జించిన సంగతి తెలిసిందే. ఎయిర్టెల్ ఏఆర్పీయూ(ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు రెవెన్యూ) ఈ క్వార్టర్లో రూ.129గా ఉంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.105గా ఉండేది. జియో, వొడాఫోన్ ఐడియా ఏఆర్పీయూతో పోలిస్తే ఎయిర్టెల్ ఏఆర్పీయూనే ఎక్కువ. ఈ క్వార్టర్లో జియోకు రూ.122 ఏఆర్పీయూ, వొడాఫోన్ ఐడియాకు రూ.108 ఏఆర్పీయూ వచ్చింది. జూన్ 30తో ముగిసే నాటికి ఎయిర్టెల్ 40.37 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. గతేడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే వీరు 10.9 శాతం తక్కువ మంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఎయిర్టెల్కు 45.66 కోట్ల మంది కస్టమర్లు ఉండేవారు. మొబైల్ డేటా ట్రాఫిక్ ఈ క్యూ1లో రెండింతలు పెరిగి 3,904 పెటాబైట్స్గా ఉంది.