ఎస్​బీఐలో భారీ కుంభకోణం.. రూ.20 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్​

ఎస్​బీఐలో భారీ కుంభకోణం.. రూ.20 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్​
  • సూర్యాపేట లో రూ.4.50 కోట్లు,  
  • హైదరాబాద్​లో రూ. 2.84 కోట్లు, వెస్ట్ మారేడ్ పల్లిలో రూ.10 కోట్లు  
  • ప్రభుత్వోద్యోగుల అప్లికేషన్లు  రిజెక్ట్ చేసి వాటిపైనే కొత్త లోన్లు  
  • బాధితుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్​

సూర్యాపేట, వెలుగు :  ఎస్​బీఐలో భారీ కుంభకోణం బయటపడింది. సూర్యాపేట, హైదరాబాద్​ రామాంతాపూర్​, వెస్ట్​మారేడ్​పల్లిల్లో పని చేసిన ఓ బ్యాంక్​ మేనేజర్​ సుమారు  రూ.20 కోట్ల భారీ మోసానికి  పాల్పడ్డాడు. అప్లై చేసుకున్న వారి లోన్లు రిజెక్ట్​ చేసి వారి పేర్లపైనే వారికి తెలియకుండా రూ.కోట్లు కొల్లగొట్టాడు.  మొదట సూర్యాపేటలో రూ.4.5 కోట్లు దోచుకున్న మేనేజర్​ సైదులు తర్వాత ​హైదరాబాద్​ రామాంతపూర్  సీసీజీ శాఖకు వెళ్లాడు. అక్కడ మరో మేనేజర్ తో కలిసి సుమారు 2.8 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డాడు. వెస్ట్​మారేడ్​పల్లి శాఖలోనూ రూ.10 కోట్ల వరకు లోన్లు తీసుకున్నాడు. ఈ విషయం వెలుగు చూడడంతో విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. ఖాతాదారుల గుర్తింపు పత్రాలతో వారికే తెలియకుండా లోన్లు తీసుకున్నట్టు చెబుతున్నారు. బాధితుల్లో మెజారిటీ శాతం ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. ప్రస్తుతం సూర్యాపేట పోలీసులకు శ్యామ్ అనే బాధితుడు ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేపట్టారు.  

బాధితుల్లో పోలీసులు కూడా...

సూర్యాపేట జిల్లాకు చెందిన షేక్‌సైదులు సూర్యాపేట నేషనల్ హైవే ఎస్‌బీఐ మేనేజర్‌గా పని చేశాడు. 2022–23లో 24 మంది పేర్లపై లోన్లు మంజూరు చేయించుకుని రూ.4.50 కోట్లు స్వాహా చేశాడు. ప్రభుత్వోద్యోగం చేస్తూ బ్యాంక్‌ లోన్ తీసుకునేందుకు అర్హత కలిగిని వారిని ఎంచుకునేవాడు. వారు లోన్​కోసం అప్లై చేసుకుంటే ఏవో కారణాలు చెప్పి రిజెక్ట్​ చేసేవాడు. అదే అప్లికేషన్‌ ఉపయోగించి మరోసారి దరఖాస్తు చేసేవాడు. ఒక్కొక్కరి పేరు మీద కనీసం రూ.15 లక్షలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని తన అకౌంట్ కు ట్రాన్స్​ఫర్​ చేయించుకునేవాడు. బాధితుల్లో పోలీస్‌ డిపార్ట్​మెంట్​కు చెందిన 11 మంది,  వైద్యారోగ్యశాఖలో ఇద్దరు, విద్యాశాఖలో ఇద్దరు, ఎక్సైజ్‌లో ఇద్దరు, కలెక్టరేట్‌లో వివిధ శాఖలకు చెందిన ఐదుగురు, మరో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు కలిపి  24 మంది ఉన్నారు. 

వెలుగులోకి వచ్చింది ఇలా....

గత సంవత్సరం హైదరాబాద్​ రామాంతాపూర్​లోని సీసీజీ (కమర్షియల్‌ క్లయిట్‌ గ్రూప్‌) మేనేజర్‌గా సైదులు బదిలీ అయ్యాడు. ఇక్కడ మరో మేనేజర్​తో కలిసి సూర్యాపేట తరహాలోనే ఇక్కడా లోన్లు తీసుకున్నాడు. ఈ లోన్లకు ఈఎంఐలు కూడా కడుతున్నాడు. ఫ్రాడ్ ​చేసిన మరో మేనేజర్ ​బదిలీ కావడంతో ఆయన ప్లేస్​లో మరో మేనేజర్​ వచ్చాడు. ఆయనకు కొన్ని ఖాతాలపై అనుమానం రావడంతో చెక్​ చేయగా గుట్టు బయటపడింది. ఎంక్వైరీ మొదలుపెట్టడంతో సైదులు పరారయ్యాడు. సూర్యాపేటలో కూడా తాను తీసుకున్న లోన్లకు ప్రతినెలా ఈఎంఐ కడుతున్న సైదులు పారిపోయిన తర్వాత డబ్బులు కట్టడం ఆపేశాడు. దీంతో 2024 ఫిబ్రవరి ఈఎంఐ కట్టలేదంటూ పలువురు ఉద్యోగులకు నోటీసులు వెళ్లాయి. దీంతో బ్యాంకు అధికారులతో పాటు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. వారు సూర్యాపేట పీఎస్​లో ఫిర్యాదు చేశారు. బాధితులు సంఖ్య మరింత పెరిగితే ఈ మోసం రూ.20 కోట్లు దాటుతుందని అంచనా.