బాలుడిపై థర్డ్ డిగ్రీ.. హెచ్ఆర్సీ సీరియస్

బాలుడిపై థర్డ్ డిగ్రీ.. హెచ్ఆర్సీ సీరియస్
  • ఈ నెల 12 లోపు అన్ని రికార్డులతో హాజరు కావాలని సిటీ సీపీకి ఆదేశం
  • నిమ్స్​లో ట్రీట్​మెంట్​ అందించాలని  సూపరింటెండెంట్​కు ఆర్డర్స్​

జూబ్లీహిల్స్​/బషీర్​బాగ్, వెలుగు: ఓ బాలుడి(17)పై జూబ్లీహిల్స్​పోలీసులు థర్డ్​డిగ్రీ ప్రయోగించిన ఘటనపై  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. జూబ్లీహిల్స్​కు చెందిన ఓ బాలుడు రీల్స్​తీసేందుకు వారు నివసిస్తున్న ఇంటిపైకి తన స్నేహితుడితో కలిసి వెళ్లి  వీడియో తీస్తుండగా.. కింద ఉన్న ఒక బాత్రూం 5 సెకన్లు పాటు రికార్డు అయిందన్న ఆరోపణతో బాలుడిపై కేసు నమోదయింది.

దీంతో పోలీసులు 15  డిసెంబర్​ 2024న బాలుడిను అదుపులోకి తీసుకొని మూడు రోజులు స్టేషన్​లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం బయటకి వచ్చిన బాలుడు ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ  నడవలేని  స్థితికి చేరుకోవడంతో, పోలీసులు చిత్రహింసలు కారణంగానే తమ కొడుకు ఈ స్థితికి చేరుకున్నారని  తెలంగాణ మానవ హక్కుల కమిషన్​కు  బాలుడి తండ్రి దగ్గుపాటి రాంబాబు ఫిర్యాదు చేశారు.

గురువారం ఈ కేసును పరిశీలించిన కమిషన్​  సీరియస్​గా తీసుకుంది.  ఈ నెల 12 తేదీలోపు  ఈ ఘటనపై అన్ని రికార్డులతో  కమిషన్​ ముందు హాజరు కావాలని హైదారాబాద్​ పోలీస్​ కమీషనర్ సీవీ ఆనంద్​ను ఆదేశించింది. అలాగే బాధిత బాలుడిని పరిశీలించి అత్యవసరమైన చికిత్సను వెంటనే అందించాలని నిమ్స్​ సూపరిండెంట్​ను కమిషన్​ చైర్మన్​ జిస్టిస్​ షమీమ్​ అక్తర్ ఆదేశించారు.