
- హుజురాబాద్ పరిధి సిర్సపల్లి వద్ద పీపీపీ పద్ధతిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్
- రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, పదుల కిలోమీటర్ల దూరం
- ప్లాంట్ కు వాహనాల్లో నిత్యం చెత్త తరలింపునకు కోట్లాది రూపాయల ఖర్చు
- ట్రాన్స్ పోర్టేషన్ భారం ఎవరు భరించాలనే విషయంలో నో క్లారిటీ
- ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు వస్తాయంటున్న సంబంధిత అధికారులు
కరీంనగర్, వెలుగు : హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిపాదిత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు చెత్త తరలింపు సమీపంలోని రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలకు దూర భారం కానుంది. చెత్త ట్రాన్స్ పోర్టేషన్ వ్యయం కూడా ఎవరు భరించాలనే దానిపై క్లారిటీ లేదు. రాష్ట్ర మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మాత్రం రోజుకు 565 టన్నుల చెత్తను ప్లాంటుకు తరలించనున్నట్లు అంచనా వేస్తోంది. కరీంనగర్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీల నుంచి వెలువడే చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలించి.. తద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
హుజురాబాద్ సమీపంలోని సిర్సపల్లి వద్ద మూడు గుట్టల మధ్య 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ, ప్రైవేట్ పార్టిపేషన్(పీపీపీ) పద్ధతిలో సుమారు రూ.100 కోట్లతో నిర్మించనుండగా.. ఇందులో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఇందుకు సంబంధించి ఆసక్తి గల ప్రైవేట్ సంస్థలు/వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ పద్ధతిని అనుసరించి రెండేండ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని,15 ఏండ్లపాటు నిర్వహించాలని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ లో వెల్లడించింది.
గ్రేటర్ వరంగల్ నుంచే అత్యధిక చెత్త తరలింపు
జనాభా ఎక్కువగా ఉన్న వరంగల్, కరీంనగర్ సిటీల్లో చెత్త నిర్వహణ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరంగల్ సిటీకి మడికొండలో, కరీంనగర్ కు మానేరు ఒడ్డున డంపింగ్ యార్డుల ఉండగా ఇబ్బందికరంగా మారింది. వీటిని తొలగించాలని స్థానికుల నుంచి నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో చెత్తను సైంటిఫిక్ మెథడ్ లో ప్రాసెస్ చేయడంతో పాటు దాని నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేందుకు హుజురాబాద్ లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో కలిపి 2026 నాటికి రోజూ 807.06 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇందులో అధికంగా గ్రేటర్ వరంగల్ నుంచే 518.62 టన్నులు వస్తుండగా.. కరీంనగర్ కార్పొరేషన్ నుంచి 190.74 టన్నులు, పరకాల మున్సిపాలిటీ నుంచి 13 టన్నులు, నర్సంపేట నుంచి 15.64 టన్నులు, హుజురాబాద్ నుంచి 19.74 టన్నులు, జమ్మికుంట నుంచి 25 టన్నులు, చొప్పదండి నుంచి 7 టన్నులు, హుస్నాబాద్ నుంచి 9.32 టన్నులు, వర్ధన్నపేట నుంచి 8 టన్నుల చెత్త వెలువడుతుందని భావిస్తున్నారు. స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా సేకరించే వ్యర్థాల్లో 30 శాతం(242 టన్నులు) పొడి చెత్తను సెగిగ్రేట్ చేసి డీఆర్ సీసీ సెంటర్లకు, ఆర్గానిక్ వ్యర్థాలు సేంద్రియ ఎరువు కేంద్రాలకు తరలించనున్నారు. మిగతా 70 శాతం(సుమారు 565 టన్నుల) చెత్తను టిప్పర్ల ద్వారా హుజురాబాద్ ప్లాంట్ తరలించనున్నారు.
ట్రాన్స్ పోర్టేషన్ భారంపై నో క్లారిటీ
హుజురాబాద్ ప్లాంట్ కు హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ మినహా మిగతా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 4 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల నుంచి నిత్యం చెత్త తరలింపు ఆర్థిక భారంతో కూడిన వ్యవహారంగా స్థానిక మున్సిపల్ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి నుంచి చెత్త తరలింపు కోసమే డీజిల్ ఖర్చుల పేరిట వరంగల్, కరీంనగర్ లో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పదుల కిలోమీటర్ల మేర రోజూ చెత్త తరలించాలంటే ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశముంది. చెత్త తరలింపు ఖర్చులు మున్సిపాలిటీలు భరించాలా.. ప్లాంట్ నిర్వాహకులు భరిస్తారా.. అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు.
మున్సిపాలిటీ రోజు వెలువడే హుజురాబాద్ నుంచి
చెత్త(టన్నుల్లో) దూరం(కి.మీ)
గ్రేటర్ వరంగల్ 518.62 45
పరకాల 13.00 41
వర్ధన్నపేట 8.00 66
నర్సంపేట 15.64 75
కరీంనగర్ 19.74 42
హుజురాబాద్ 19.74 5
జమ్మికుంట 25.00 20
చొప్పదండి 7.00 61
హుస్నాబాద్ 9.32 30