
సింగపూర్: లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే 2028 ఒలింపిక్స్లో ఆడే జట్లను హైబ్రిడ్ మోడల్లో ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించింది. తమ పాలనలో లోపాలను, సమస్యలను పరిష్కరించేందుకు యూఎస్ఏ క్రికెట్ అసోసియేషన్ (యూఎస్ఏసీ)కు మూడు నెలల సమయం ఇచ్చి ఊరట కల్పించింది. ఈ మేరకు సింగపూర్లో శనివారం జరిగిన ఐసీసీ (ఐసీసీ) బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా యూఎస్ఏసీ పాలనలో లోపాలున్నాయని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ఈ పరిస్థితి అమెరికా ఒలింపిక్ కమిటీతో (యూఎస్ఓపీసీ) కూడా దానికి సమస్యలు తెచ్చిపెట్టింది. ఐసీసీ దాదాపు ఏడాదిగా అమెరికా క్రికెట్ సంఘాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. గత జులైలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక కూడా జారీ చేసింది. కానీ, గత నెలలో అమెరికాను సందర్శించిన ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ ఆ సంఘం పనితీరు పట్ల సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఐసీసీ.. ఆ దేశం సభ్యత్వాన్ని రద్దు చేసేది. కానీ, అమెరికా రాబోయే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నందున యూఎస్ఏసీకి ఈ వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది. పరిస్థితి సున్నితంగా ఉండటంతో జై షా నేతృత్వంలోని ఐసీసీ.. యూఎస్ఏసీకి మూడు నెలల గడువు ఇచ్చింది. కాగా, ఒలింపిక్స్కు ఆతిథ్యం దేశంగా అమెరికా మెన్స్, విమెన్స్ జట్లు టీ20 ఈవెంట్కు నేరుగా అర్హత సాధిస్తాయి. కానీ, ఆ జట్లను ఎవరు ఎంపిక చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. యూఎస్ఏసీ ఈ మూడు నెలల్లో తమ పాలనను మెరుగుపరుచుకుంటే జట్లను ఎంపిక చేసే బాధ్యతను యూఎస్ ఒలింపిక్ కమిటీ దానికే అప్పగిస్తుందా అనేది చూడాలి.
ఒలింపిక్స్లో ఇండియాకు డైరెక్ట్ ఎంట్రీ..!
2028 ఒలింపిక్స్లో ఆడే జట్లను తేల్చేందుకు హైబ్రిడ్ మోడల్ను అమలు చేస్తే కొన్ని జట్లు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధిస్తాయి. మరికొన్ని జట్లు క్వాలిఫికేషన్ మ్యాచ్ల్లో పోటీపడాల్సి ఉంటుంది. వరల్డ్ నంబర్ 1 ర్యాంక్లో ఉన్న ఇండియా నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉంది. కాగా, ఐసీసీ బోర్డు క్రికెట్లోని మూడు ఫార్మాట్ల నిర్మాణంపై సిఫార్సులు చేయడానికి ఒక వర్కింగ్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసింది. సింగపూర్లో జరుగుతున్న ఈ సమావేశం చివరి రోజైన ఆదివారం పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.