ఆకాశానికి గండి..ఏరులైన దారులు..కొట్టుకుపోయిన బండ్లు..

ఆకాశానికి గండి..ఏరులైన దారులు..కొట్టుకుపోయిన బండ్లు..
  • ట్రాఫిక్​ జామ్​​తో వాహనదారులకు నరకం​

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కుండపోత వర్షం పడింది. ఆకాశానికి గండి పడిందా అన్నట్టుగా గ్రేటర్ వ్యాప్తంగా ఏకధాటిగా వర్షం దంచికొట్టింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 13.7 సెంటీమీటర్ల వాన పడింది. దారులన్నీ ఏరులై పారడంతో ట్రాఫిక్ జామ్​లతో వాహనదారులు నరకం చూశారు. 

పలు చోట్ల బండ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద చేరింది. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్​లోని కేశవ్ నగర్​లో రెండు చెట్లు రోడ్డుపై కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మణికొండలో ఓ కారుపై ప్రహారీ కూలింది. వర్షం కారణంగా మెట్రో స్టేషన్లలో రద్దీ నెలకొంది. 

 అధికారులకు సెలవులు రద్దు

అధిక వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన రెవెన్యూ సిబ్బంది, అధికారుల  సెలవులను రద్దు చేశారు. కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశారు. ఇండ్లలో నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఉంటే 040–2302813, 7416687878 కు కాల్ చేయాలని కోరారు.  

అలాగే, వాటర్​బోర్డు సిబ్బందికి మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఎండీ అశోక్​రెడ్డి ప్రకటించారు. ఓవర్​ఫ్లో అవుతుందని మ్యాన్​హోల్స్​ తెరవకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఇన్ స్పెక్షన్​ చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఫీల్డ్​లోకి అధికారులు, సిబ్బంది..

భారీ వర్షం, ట్రాఫిక్​ జామ్​తో ట్రాఫిక్ పోలీసులు,  బల్దియా,  హైడ్రా, వాటర్​బోర్డు టీమ్స్​ రంగంలోకి దిగాయి. నీళ్లు నిలిచిన చోట్లకు వెళ్లి నీటిని తొలగించారు. బంజారా నాలా వద్ద మేయర్ విజయలక్ష్మి పరిస్థితిని పరిశీలించారు. నాలా చుట్టు బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

తెగి పడిన తీగలు.. పవర్ కట్

హైదరాబాద్, వెలుగు: జడివానకు పలు ప్రాంతాల్లోని 43, 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌, హైదరాబాద్‌ సౌత్‌, సైబర్‌ సిటీ, రాజేంద్రనగర్‌ , సరూర్‌నగర్‌, హబ్సిగూడ, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్​ తీగలు తెగి కరెంటు సరఫరాకు ఇబ్బంది ఏర్పడిందని సదరన్​ డిస్కం సీఎండీ వెల్లడించారు. దీంతో విద్యుత్​ సిబ్బంది, రెస్క్యూ టీమ్​లు రంగంలోకి దిగి చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

హిమాయత్​సాగర్​ గేట్​ ఓపెన్ 

  • జంట జలాశయాలకు భారీగా వరద  

 హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​కు భారీగా వరద చేరడంతో ఫుల్​ట్యాంక్​ లెవెల్​కు చేరుకున్నాయి. దీంతో గురువారం రాత్రి 10గంటలకు హిమాయత్ సాగర్ ఒక గేట్​ను ఫీట్​వరకూ ఎత్తారు. 

పెరుగుతున్న వరదను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని గేట్లు ఎత్తే విషయాన్ని ఆలోచిస్తామని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. హిమాయత్​ సాగర్​ ఫుల్​ట్యాంక్​ లెవెల్​1763.50 అడుగులు కాగా ఇప్పటికే 1762.80 ఫీట్లకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఉస్మాన్​సాగర్​ఫుల్​ట్యాంక్​లెవెల్​1790.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1782.90 అడుగులకు చేరుకుంది.