
- రాణించిన విలియమ్సన్, అభిషేక్, పూరన్
- హార్దిక్ హాఫ్ సెంచరీ వృథా
నావి ముంబై: ఐపీఎల్–15లో హైదరాబాద్కు వరుసగా రెండో విజయం. హ్యాట్రిక్ విక్టరీల తర్వాత గుజరాత్ టైటాన్స్కు తొలి ఓటమి. టార్గెట్ ఛేజింగ్లో కెప్టెన్ విలియమ్సన్ (46 బాల్స్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 57), అభిషేక్ శర్మ (32 బాల్స్లో 6 ఫోర్లతో 42) నిలకడగా ఆడటంతో సోమవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 8 వికెట్ల తేడాతో టైటాన్స్పై నెగ్గింది. టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 162/7 స్కోరు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (42 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 50 నాటౌట్), అభినవ్ మనోహర్ (35) రాణించారు. తర్వాత హైదరాబాద్ 19.1 ఓవర్లలో 168/2 స్కోరు చేసి నెగ్గింది. చివర్లో నికోలస్ పూరన్ (18 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్) దంచాడు. విలియమ్సన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇద్దరు మాత్రమే..
ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్కు స్టార్టింగ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లోశుభ్మన్ గిల్ (7), ఆరో ఓవర్లో సాయి సుదర్శన్ (11)ను ఔట్ చేసి హైదరాబాద్ బౌలర్లు షాకిచ్చారు. అయితే రెండో ఎండ్లో మాథ్యూ వేడ్ (19) మెరుగ్గా ఆడటంతో పవర్ప్లేలో గుజరాత్ 51/2 స్కోరు చేసింది. కెప్టెన్ హార్దిక్.. చివరి వరకు క్రీజులో ఉన్నా భారీ షాట్లు ఆడకుండా సన్ బౌలర్లు బాగా కట్టడి చేశారు. 8వ ఓవర్లో అతను వరుసగా రెండు ఫోర్లు కొడితే.. అదే ఓవర్లో వేడ్ ఔట్కావడంతో జీటీ స్కోరు 64/3గా మారింది. 9వ ఓవర్లో మార్క్రమ్ బాల్ను డీప్ మిడ్వికెట్లో సిక్సర్గా మలిచిన పాండ్యా.. స్లాగ్ ఓవర్స్లో ఆ స్థాయిలో షాట్లు కొట్టలేకపోయాడు. దీంతో ఫస్ట్ టెన్లో 80/3 స్కోరు చేసిన గుజరాత్.. తర్వాతి పది ఓవర్లలో 82 రన్సే చేసింది. మధ్యలో మిల్లర్ (12) విఫలమైనా నాలుగో వికెట్కు 40 రన్స్ సమకూరాయి. చివర్లో అభినవ్ మనోహర్.. పాండ్యాకు అండగా నిలిచాడు. పాండ్యా స్ట్రయిక్ రొటేట్ చేయగా.. మనోహర్ వరుసగా బౌండ్రీలు కొట్టాడు. 18వ ఓవర్లో 6, 4తో 13 రన్స్ రాబట్టాడు. ఈ మధ్యలో రెండుసార్లు క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డాడు. చివరకు భువీ (2/37) దెబ్బకు 19వ ఓవర్ వికెట్ ఇచ్చుకున్నాడు. దాంతో, ఐదో వికెట్కు 50 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. లాస్ట్ ఓవర్లో నటరాజన్ (2/34) మూడు బాల్స్ తేడాలో హిట్టర్ తెవాటియా (6), రషీద్ (0)ను పెవిలియన్కు పంపి టైటాన్స్ను కట్టడి చేశాడు.