హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో ప్రభావిత ఆస్తుల తగ్గింపు

హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో ప్రభావిత ఆస్తుల తగ్గింపు
  • అలైన్ మెంట్  సర్దుబాటుతో 1100 నుంచి 900కు 
  • మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అలైన్ మెంట్ ను సరిదిద్దడంతో ఓల్డ్  సిటీ మెట్రో ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100 నుంచి 900కు తగ్గిందని హెచ్ఏఎంఎల్  ఎండీ ఎన్వీఎస్  రెడ్డి తెలి పారు. ఇప్పటివరకూ 412 ఆస్తులకు నష్టపరిహారం అవార్డులు జారీ చేశామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 380 ఆస్తుల కూల్చివేతలు పూర్తిచేసి, రూ. 360 కోట్ల నష్టపరిహారం చెల్లించామని వెల్లడించారు. జేబీఎస్  నుంచి చంద్రాయణగుట్ట మధ్య 7.5 కి.మీ. మెట్రో రైల్  కారిడార్  ఏర్పాటుకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేశామని చెప్పారు.

సంక్లిష్టమైన విద్యుత్ లైన్లు, కేబుళ్ల మధ్య అర్ధరాత్రి కూడా పనులు చేస్తున్నామన్నారు. పిల్లర్ల మార్కింగ్  ప్రారంభమైందని, 25 మీటర్ల దూరంలో పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నామని, భూసామర్థ్య పరీక్షల కోసం ఏజెన్సీని నియమించామని వివరించారు. చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా డీజీపీఎస్  సర్వే నిర్వహించి, యుటిలిటీ లైన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.