
హైదరాబాద్ లో సెప్టెంబర్ 28న గణేష్ నిమజ్జనం జరగనుంది. అలాగే అక్టోబర్ 1న మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో నగరంలో శాంతియుత వాతావరణం కోసం సిటీ పోలీసులు విన్నూత కార్యక్రమం చేపట్టారు. నగరంలోని పోలీసులు గణేష్ మండపాలకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు పండుగల మధ్య మతపరమైన జెండాలు నగరంలో శాంతియుత వాతావరణంలో ఆటంకాలు కలిగిస్తాయని భావిస్తున్నారు.
సెప్టెంబర్ 22న హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు తమ ప్రాంతాల్లోని గణేష్ మండపాలకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. హైదరాబాద్లో అక్టోబర్ 1న జరిగే మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా కూడా పోలీసులు త్రివర్ణ పతాకాన్ని పంచే అవకాశం ఉంది.
Also Read :- హైదరాబాద్ లో ముస్లింలు ఏర్పాటు చేసిన గణేష్ మండపం.. రోజూ పూజలు
ఈ ఏడాది సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ జరగాల్సి ఉన్నప్పటికీ అదే రోజు గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఉండటంతో మత పెద్దలు ర్యాలీని వాయిదా వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పోలీస్ ఉన్నతాధికారులు ముస్లిం మతపెద్దలతో చర్చించారు. గణేశ్ శోభాయాత్ర, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు మతపెద్దలు, పీస్ కమిటీ మెంబర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. సాధ్యాసాధ్యాలపై చర్చించి తుది నిర్ణయం ప్రకటించారు. అక్టోబర్ 1న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు హైదరాబాద్లోని చార్మినార్, గుల్జార్ హౌజ్, పతేర్గట్టి, చట్టా బజార్, పురానీ హవేలీ, ఎతేబార్ చౌక్ మరియు బీబీ బజార్తో సహా పలు చారిత్రక ప్రదేశాల గుండా వెళుతుంది, అసర్ ప్రార్థనలకు ముందు మొఘల్పురా వద్ద ముగుస్తుంది.