- డ్రగ్స్ కేసులో విచారణకు సహకరించని నిందితులు
- ఇంకో 5 రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల పోలీస్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. సోమవారం వారిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో చంచల్గూడ జైలులో రిమాండ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ నెల 14 నుంచి 4 రోజులపాటు బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. మేనేజర్ అనిల్ కుమార్ ముందున్న ట్రే నుంచి స్వాధీనం చేసుకున్న 4.64 గ్రాముల కొకైన్, డ్రగ్స్ కస్టమర్ల గురించి వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ, అనిల్, పబ్ పార్ట్నర్ అభిషేక్ విచారణకు సహకరించలేదని తెలిసింది. పబ్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలియదని చెప్పినట్లు సమాచారం. దీంతో నిందితులను ఇంకో 5 రోజుల కస్టడీకి కోరనున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
10 మందికి నోటీసులు ఇచ్చే చాన్స్
పబ్ పార్ట్నర్స్, పబ్ యాక్టివిటీస్, కస్టమర్ల డేటాను పోలీసులు కలెక్ట్ చేశారు. అనిల్ కుమార్, అభికేష్ ఉప్పలకు గోవా, ముంబైకి చెందిన డ్రగ్ పెడ్లర్స్తో పరిచయాలు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనిల్ కుమార్, అభిషేక్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా 10 మందికి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.