- 23 శాతం పెరిగిన సిటీరెసిడెన్షియల్ మార్కెట్
- 2011 హెచ్1 తరువాత ఇదే అత్యధికం
- రెంట్, ఆఫీసు మార్కెట్లకూ ఢోకా లేదు!
- నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టులో వెల్లడి
హైదరాబాద్: సిటీలో రియల్టీ దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుత సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (హెచ్1) హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ బాగా ఎదిగింది. కిందటి ఏడాది హెచ్1తో పోలిస్తే ఈసారి అమ్మకాలు 23 శాతం పెరిగి 14,693 హౌసింగ్ యూనిట్లుగా రికార్డయ్యాయి. 2011 హెచ్1 తరువాత ఇంత ఎక్కువగా అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా రిపోర్టు ‘ఇండియా రియల్ ఎస్టేట్: హెచ్1 2022 ’లో వెల్లడించింది. ఇందులోని వివరాల ప్రకారం...కరోనా మహమ్మారి వల్ల ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్కు పెద్దగా ఎఫెక్ట్ కాకపోవడంతో ఇండ్లకు డిమాండ్ తగ్గలేదు. 2022 హెచ్1లో కొత్త ఇండ్ల లాంచ్లు ఏడాది లెక్కన 28% పెరిగి 21,356 హౌసింగ్ యూ నిట్లకు చేరుకున్నాయి. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో పశ్చిమ హైదరాబాద్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. 2022 హెచ్ 1లో జరిగిన మొత్తం అమ్మకాల్లో ఇది 62% మార్కెట్ వాటా సాధించింది ఆఫీస్ మార్కెట్ పనితీరును గమనిస్తే 2022 జనవరి నుంచి జూన్ వరకు బిజినెస్ బాగుంది. లావాదేవీలు 101శాతం పెరిగాయి. ఈ అమ్మకాలు సైజు 2021 హెచ్1లో 1.07 మిలియన్ చదరపు అడుగులు ఉండగా, ఈసారి 3.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. కొత్త ఆఫీసులు పూర్తి కావడంతో అదనంగా జాగా అందుబాటులోకి వచ్చింది. ఐటీ రంగం ఆఫీస్ స్పేస్కు వెన్నెముకగా నిలుస్తోంది. ఐటీ లావాదేవీలు ఏడాది లెక్కన ప్రాతిపదికన 62శాతం పెరిగాయి. 2021 హెచ్1లో ఇవి 0.8 మిలియన్ చదరపు అడుగులు ఉండగా, 2022 హెచ్1 లో 1.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగాయి. రెంట్మార్కెట్ కూడా 2022 హెచ్1 లోనూ జోరు మీద ఉంది. రెంటల్ ట్రాన్సాక్షన్లు ఏడాది లెక్కన 3.3శాతం పెరిగాయి. సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (ఎస్బీడీ) ఈ మార్కెట్ లో తన ఆధిక్యాన్ని కొనసాగించిందని నైట్ఫ్రాంక్ తెలిపింది.