2 వేల సీట్లు కేటాయించినట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మన దేశ స్టూడెంట్లకు ఉజ్బెకిస్తాన్ సర్కార్ శుభవార్త తెలిపింది. ఇండియన్ స్టూడెంట్లను తమ దేశంలోని మెడికల్ కాలేజీల్లో చేర్చుకుంటామని ఆ దేశ రాయబారి దిల్షోద్ అఖతోవ్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని హరితప్లాజాలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇండియన్ మెడికోల కోసం తమ దేశంలో మెడికల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో 2 వేల సీట్లను కేటాయించామని వెల్లడించారు. ఇవన్నీ ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటాయని తెలిపారు. తమ దేశంలో ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు డిప్లొమా కోర్సు అందుబాటులో ఉందని చెప్పారు. తమ కాలేజీల్లో ఇండియా ప్రొఫెసర్లు సుమారు 30 శాతం ఉంటారని, ఇది ఇండియన్ స్టూడెంట్లకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. ఇంటర్వ్యూల ద్వారా స్టూడెంట్లను ఎంపిక చేసుకుంటామన్నారు.
ఇప్పటికే ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన తెలంగాణకు చెందిన కొంత మంది స్టూడెంట్లకు అడ్మిషన్ లెటర్లను అందజేశారు. కాగా, ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించడంతో అక్కడ మెడిసిన్ చదువుతున్న సుమారు 20 వేల మంది మనోళ్లు తిరిగి వచ్చేశారు. వీరిలో మన రాష్ట్రం వాళ్లు సుమారు 1,500 మంది వరకు ఉంటారు. ఇప్పటికే వీళ్లది ఒక అకడమిక్ ఇయర్ వృథా అయింది. రష్యాలోని మెడికల్ కాలేజీలు సైతం ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఇండియన్ స్టూడెంట్లను చేర్చుకుంటున్నాయి. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ కూడా ఓకే చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కొంత ఊరట లభించింది.