సంధ్య కన్వెన్షన్​లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

సంధ్య కన్వెన్షన్​లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
  • తమ ఫ్లాట్లను ఆక్రమించారని ఎఫ్​సీఐ సొసైటీ ఫిర్యాదు 
  • విచారణ అనంతరం చర్యలు తీసుకున్న హైడ్రా

గచ్చిబౌలి, వెలుగు: అనుమతులు లేకుండా గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్​యాజమాన్యం ఏర్పాటు చేసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎఫ్ సీఐ ఎంప్లాయిస్ హౌసింగ్​సొసైటీ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన షెడ్లను మంగళవారం నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా వేసిన రోడ్డును హిటాచీలతో తొలగించారు. సైబరాబాద్​పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 124, 125లో 20 ఎకరాల స్థలం ఉంది.

ఇందులో ఫర్టిలైజర్స్​కార్పొరేషన్​ఆఫ్​ఇండియా ఎంప్లాయిస్​ కోపరేటివ్​హౌసింగ్​సొసైటీ లేఅవుట్ ఉంది. ఇందులో 162 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్​కు ఆనుకొని సంధ్య కన్వెన్షన్​ఉంది. అయితే కొంత కాలంగా ఎఫ్​సీఐ సొసైటీ ఫ్లాట్ల యజమానులకు, సంధ్య కన్వెన్షన్​ఎండీ శ్రీధర్​రావు మధ్య స్థల వివాదం నడుస్తోంది. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ వివాదంపై విచారణ జరుగుతోంది. వివాద భూమిలోనే శ్రీధర్​రావు ఎలాంటి అనుమతులు లేకుండా సంధ్య కన్వెన్షన్​మినీ హాల్, వంట గదులు, రెస్ట్​రూంలు, డెస్సింగ్​రూంలుగా జీ ప్లస్ 2 పద్దతితో మూడు ఐరన్​షెడ్లను నిర్మించారు.

లేఅవుట్ చుట్టూ భారీ ​రేకుల ఫెన్సింగ్​ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఎఫ్​సీఐ ఫ్లాట్ల యజమానులు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. తమ ఫ్లాట్లు గుర్తుపట్టకుండా రోడ్లను, పార్కులను కలుపుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. అక్రమ షెడ్ల కోసం సిమెంట్​రోడ్డును నిర్మించారని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు మంగళవారం భారీ హిటాచీలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్​ వద్దకు చేరుకొని అనుమతులు లేకుండా నిర్మించిన  సంధ్య కన్వెన్షన్​మినీ హాల్, జీ ప్లస్ 2 పద్దతితో నిర్మించిన మూడు ఐరన్​షెడ్లను కూల్చివేశారు.

ఐరన్​ ఫెన్సింగ్​ను, సిమెంట్​ రోడ్డును కూడా తొలగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగాయి. ఇదే స్థలంలో చేపట్టిన భారీ డ్రైవ్​ఇన్​పై కోర్టు స్టే ఉందని, స్టే ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. 

శ్రీధ‌ర్​రావుపై ఫిర్యాదుల వెల్లువ

హైడ్రా చ‌ర్యల‌తో ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకున్న బాధితులు వివిధ మార్గాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. తమ ఫ్లాట్లు కబ్జా చేశారని న‌గ‌రంలో ఉన్నవారే కాకుండా.. విదేశాల్లో ఉన్నవారు కూడా హైడ్రాకు ఆన్‌లైన్​లో ఫిర్యాదు చేస్తున్నారు. శ్రీధర్​రావు త‌మ‌ను లే ఔట్‌లోకి కూడా రానీయ‌కుండా అడ్డుకున్నార‌ని.. తమ ప్రమేయం లేకుండా డెవ‌ల‌ప్‌మెంట్ అగ్రిమెంట్లు రాయించుకుని నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.  మెయిల్స్‌, వీడియోల రూపంలో గోడును వెల్లబోసుకుంటున్నారు.

మేము కొనుక్కున్న ఫ్లాట్​లేద‌ని శ్రీ‌ధ‌ర్​రావు మ‌నుషులు చెప్పడంతో త‌న భ‌ర్త ఆత్మహ‌త్య చేసుకున్నారంటూ ఢిల్లీ నుంచి ఓ మ‌హిళ ఆన్‌లైన్​లైన్​లో ఫిర్యాదు చేశారు. త్వర‌లో హైద‌రాబాద్ కు వ‌చ్చి నేరుగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. రాయదుర్గంలోని సంధ్య టెక్నో పార్కుతోపాటు వేర్వేరు ప్రాంతాల్లో శ్రీ‌ధ‌ర్​రావు చేసిన ఆక్రమణ‌ల‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే శ్రీధర్​రావుపై వివిధ పోలీస్​ స్టేషన్​లలో చీటింగ్, కబ్జాలపై 30 వరకు కేసులు నమోదు అయ్యాయి. ఎఫ్​సీఐ లేఔట్​వివాదంపై 5 కేసులు ఉన్నట్లు బాధితులు తెలిపారు.

మైలార్​దేవ్​పల్లిలో గోడ కూల్చివేత..

శంషాబాద్: మైలార్ దేవుపల్లి పరిధిలోని ఇందిరాగాంధీ సొసైటీలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన గోడను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు. పలువురు అక్రమార్కులు గొడవకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరికి భారీ బందోబస్త్​నడుమ గోడను కూల్చివేశారు. దీంతో ఇందిరా గాంధీ సొసైటీవాసులు స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.