ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆవిర్భావ బహిరంగ సభ గురించి బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం సభ గురించి తనకు తెలియదన్నారు. తాను ఇతర పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పిన నితీష్.. ఒకవేళ సభకు కేసీఆర్ ఆహ్వానించినా తాను హాజరు కాలేకపోయేవాడినని చెప్పారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఖమ్మం సభకు వెళ్లే వీలు తనకు ఉండేది కాదన్నారు.
ఆహ్వానం అందిన నేతలు కచ్చితంగా వెళ్లి ఉంటారని నితీశ్ అన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి ముందుకెళ్తే చూడాలని తనకు ఉందని, అయితే..అది తనకు కలగా ఉందని చెప్పుకొచ్చారు. విపక్షాలు ఏకతాటిపైకి వస్తే దేశానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వంటి సీనియర్లు పాల్గొన్నారు.