
తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆనంద్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి సోదరుడే ప్రశాంత్ రెడ్డి. ఈయన హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. కొన్ని మీడియా చానెల్స్ లో ఆనంద్ హత్యలో ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని ప్రచారం జరిగింది. దీంతో సీఐ ప్రశాంత్ రెడ్డి స్పందించారు.
తల్లిదండ్రుల సాక్షిగా ఏ పాపం తెలియదు..
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆనంద్ రెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఇన్ స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తనపై వస్తోన్న ఆరోపణలు కలిచివేశాయని ఒక ఆడియో టేపును విడుదల చేశారు. తన 24 ఏళ్ల సర్వీసులో ఎక్కడ పని చేసినా సిన్సీయర్ గా వర్క్ చేశాను.. ఏ చిన్న తప్పు కూడా చేయలేదన్నారు. ఆనంద్ రెడ్డి హత్య కేసులో తన పేరు రావడం బాధ కలిగించిందని చెప్పారు. తన తల్లిదండ్రుల సాక్షిగా, చదువు నేర్పిన సరస్వతి మాత సాక్షిగా.. మనస్సాక్షిగా చెబుతున్నానని చెప్పాడు. నా పరువును దయచేసి తీయవద్దని.. అసత్యపు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా దయచేసి తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. పని చేసిన ప్రతీ చోటా తన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని తెలిపారు.